ఉగ్రదాడిని భగ్నం చేసిన సైన్యం, పోలీస్
గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు
విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం పోలీసులు సంయుక్తంగా అపరేషన్ చేపట్టారు. వెంటనే తనిఖీలు చేశారు. ఆ సందర్బంలో ఉగ్రవాదులు రైల్వే ట్రాక్ సమీపంలో ఎదురుపడ్డారు. ఉగ్రవాదులు పోలీసులు, సైనికాధికారుల మీద కాల్పులు జరిపారు.
పోలీసులు, సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాది మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. మిగిలిన ఉగ్రవాదులు అక్కడి నుండి తప్పించుకున్నారు. ఉగ్రవాదులు తీసుకు వచ్చిన 7 కిలోల పేలుడు పదార్థాలను ( ఐఈడీ) పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా పిస్టల్, మేగజైన్, బాంబులు, రెండు గ్రేనెడ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఉగ్రవాదులు అసోంలో దాడులకు పాల్పడుతారని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించిన నేపధ్యంలో అసోంలో సోదాలు ముమ్మరం చేశారు.