బెంగళూరులో ప్రధాని మోదీ వెళ్లే రూట్ లో భారీగా పేలుడు పదార్థాలు
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన నేపథ్యంలో తీవ్ర భద్రత లోపాలు తలెత్తాయి. ఆయన ఆదివారం ప్రయాణించనున్న మార్గంలో పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలకు వస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని కాన్వాయ్ మార్గంలో జిలెటిన్ స్టిక్స్ లభించడం కలకలం చెలరేగింది. ఈ ఘటనలో పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చారు. కగ్గళిపుర సమీపంలోని తాతాగుణిలో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమ వేదికకు రోడ్డు మార్గంలో వెళ్లారు. అదే ప్రదేశంలో జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. అనుమానితుడు ఈ ఉదయమే పోలీసు స్టేషన్కు ఫోన్ చేసి హెచ్ఏఎల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాల వద్ద పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో భద్రతా ఏజెన్సీలు వెంటనే రెండు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కోరమంగళలోని ఓ ఇంట్లో నుంచి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద ఏమీ దొరకనప్పటికీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంతంలో తనిఖీలు జరిపిన అధికారులు ప్రధాని మార్గంలోని వంతెన పక్కన కాంపౌండ్ వాల్ వద్ద జిలెటిన్ స్టిక్స్ను కనుగొన్నారు. ఆ తర్వాతే కాల్ చేసిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీస్ డిప్యూటీ కమిషనర్ సహా సీనియర్ అధికారులు అనుమానితుడిని విచారిస్తున్నారు.
పేలుడు పదార్థాలు ఎక్కడ లభించాయి, ఎలా సరఫరా చేశారు, ఎవరు దీనికి కారకులనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడి నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకుంటోన్నారు. దీనికి గల కారణాలపై కూపీ లాగుతున్నారు. దర్యాప్తులో భాగంగా అతని తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారు. గతంలో కూడా వీఐపీ పర్యటనల సమయంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అప్పట్లో మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా అతడిని అదుపులోకి తీసుకుని విడుదల చేశారు.
అయితే, ఈసారి అధికారులు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. హెచ్చరిక తర్వాత నిజంగానే పేలుడు పదార్థాలు లభ్యం కావడమే దీనికి కారణం. రెండు జిలెటిన్ స్టిక్స్ను ఉద్దేశపూర్వకంగా మార్గం పక్కన పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతరుల ప్రమేయంపై కూడా విచారణ జరుగుతోంది. పేలుడు పదార్థాలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యతిరేకులతో సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో బెంగళూరు అంతటా భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. ప్రధానమంత్రి పర్యటన మార్గాల్లో ప్రత్యేకించి భద్రతను పటిష్ఠం చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, ఫోరెన్సిక్ నిపుణులు ఈ పేలుడు పదార్థాలను పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న జిలెటిన్ స్టిక్స్ల సంఖ్యను ఇంకా ధృవీకరించలేదు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, తదుపరి వివరాలు సాంకేతిక పరీక్షలు, అనుమానితుడి విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications