‘బెంగళూరును దేశ రెండో రాజధానిని చేయండి’
బెంగళూరు: దేశ రెండో రాజధానిగా బెంగళూరును చేయాలని ఆ రాష్ట్ర మధ్యతరహా, భారీ పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఆర్వి దేశ్పాండే ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన మోడీకి లేఖ రాశారు. దేశానికి రెండో రాజధాని చాలా ముఖ్యమని, ఆ స్థానాన్ని బెంగళూరు నగరం భర్తీ చేయగలదని అభిప్రాయపడ్డారు.
'బెంగళూరు నగరం దేశానికి దక్షిణ ప్రాంతంలో ఉంది. ఇక్కడ చక్కటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పకృతి వైపరిత్యాలకు ఆస్కారంలేని ప్రాంతమిది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, వ్యాపారులు ఇక్కడ చాలా మంది ఉన్నారు' అని తెలిపారు.
హైదరాబాద్ దేశ రెండో రాజధాని?: తేల్చేసిన కేంద్రమంత్రి
అంతేగాక, 'బెంగళూరులో పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఉంది. భారతదేశానికి అర్జెంటుగా రెండో రాజధాని అవసరం.. దీనికి బెంగుళూరు బాగా సరిపోతుంది' అంటూ దేశ్పాండే లేఖలో వివరించారు.
కాగా, ఇప్పటికే హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలని తెలంగాణ ఎంపీలు కోరిన విషయం తెలిసిందే. ఇటీవల లోకసభలో తెలంగాణ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ హైదరాబాద్ను రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన ఏమైనా కేంద్రం వద్ద ఉందా? అని ప్రశ్నవేయగా.. కేంద్రమంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.