నయా లుక్: అత్యంత వేగవంతమైన రైలుకు కొత్త సొబుగులు
దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన గటిమాన్ ఎక్స్ప్రెస్కు ప్రపంచంలోని ఇతర వేగవంతమైన రైళ్లలో ఉండే సదుపాయాలు కల్పించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందుకోసం మొత్తం రైలుకు కొత్త లుక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లే ఈ గటిమాన్ ఎక్స్ ప్రెస్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి మొత్తం 233 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. వచ్చే నెల చివరికల్లా గటిమాన్ ఎక్స్ప్రెస్కు కొత్త లుక్ రానుంది. దీంతో ప్రయాణించే ప్రయాణికులు కొత్త అనుభూతికి గురవుతారని రైల్వే శాఖ చెబుతోంది.
గటిమాన్ ఎక్స్ ప్రెస్లో శతాబ్ది ఎక్స్ ప్రెస్లో ఉన్నట్లుగానే కార్ ఛైర్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. అంతేకాదు మరింత క్వాలిటీతో ఇవి ఉంటాయని వారు చెబుతున్నారు. 2016 ఏప్రిల్లో ఈ ట్రైన్ పట్టాలెక్కిందని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రైన్లో పలు మార్పులు చేయనున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. రైలులో స్వచ్ఛత పరిశుభ్రత నుంచి ఇంటీరియర్ వరకు అన్నీ మారుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గటిమాన్ ఎక్స్ప్రెస్ ఇంటీరియర్ను యాంటీ గ్రావిటీ వినైల్ వ్రాపింగ్తో రూపొందిస్తున్నారు. టాయ్లెట్స్ను కూడా టాప్ క్లాస్గా తీర్చి దిద్దుతున్నారు. టాయ్లెట్స్ ఫ్లోరింగ్ మార్చడంతో పాటు అత్యాధునిక ఫ్లష్ సిస్టంను ప్రవేశపెడుతున్నారు. మోడ్రన్ సోప్ డిస్పెన్సర్ ఏర్పాటు,శానిటరీ ప్యాడ్ డిస్పెన్స్ర్, కొత్త కుళ్లాయిలను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లోర్పై నీళ్లు నిలవకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. అంతేకాదు టాయ్లెట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా కొత్త షెడ్యూల్ను ఖరారు చేస్తున్నారు. రైలు మొత్తాన్ని ఎల్ఈడీ లైట్లతో తీర్చి దిద్దుతున్నారు.