మాల్యా ఆఫర్ ఇదే: సుప్రీంలో లాయర్ వింత వాదన
న్యూఢిల్లీ: బ్యాంకులను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే కేసులో విజయ్ మాల్యా ఓ అడుగు ముందుకేశారు. బ్యాంకులను నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయమై బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు విజయ్ మాల్యా తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
మొత్తం రూ. 9 వేల కోట్ల వరకు మాల్యా బ్యాంకులకు అప్పుగా ఉండగా వాటిలో రూ. 4 వేల కోట్లను సెప్టెంబర్లోగా చెల్లిస్తానని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు వెల్లడించారు. మాల్యా ప్రతిపాదనపై వారంలోగా స్పందించాలని సుప్రీంకోర్టు బ్యాంకుల కన్సార్టియంను ఆదేశించింది.
ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించిన కేసులో మాల్యా మార్చి 2న భారత్ వదిలి లండన్ వెళ్లిపోయారు. దీంతో మార్చి 18న మాల్యా కోర్టులో హాజరుకావాలని ఈడీ మాల్యాకు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.
మార్చి నెలలో భారత్ రాలేనని ఏప్రిల్లో హాజరవుతానని మాల్యా న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. మాల్యా తరుపున ఆయన న్యాయవాది సుప్రీం కోర్టులో వాదన వినిపించారు. ఈ సందర్భంగా మాల్యా తరుపు న్యాయవాది బుధవారం కోర్టులో వితండ వాదన చేశారు.
కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఆ తర్వాత తనకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియంతో రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారట. ఈ విషయాన్ని మాల్యా లాయర్ కోర్టుకు చెబితే కాని వెల్లడి కాలేదు.
విచారణలో భాగంగా మీడియా అతి చేసిందని మాల్యా లాయర్ ఆరోపించారు. అయితే, ఈ వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ కొట్టిపారేశారు. సమాజ హితాన్ని బాధ్యతగా పరిగణిస్తున్న మీడియా మాల్యాపై కథనాలు రాయడంలో ఎలాంటి పొరపాటు లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఆయన లండన్ వెళ్లిపోయాడు. తనపై అంతర్జాతీయ మీడియా సైతం దుమ్మెత్తిపోయడంతో తాజాగా బ్యాంకులకు మాల్యా ఈ ఆఫర్ ఇచ్చాడు.