పైలట్ చాకచక్యం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నాం: మమతా బెనర్జీ
కోల్కతా: విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఎయిర్క్రాఫ్ట్ను మరో విమానం ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. 8 వేల అడుగులో ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మరో విమానం తమ ఎయిర్క్రాఫ్ట్ వైపు వచ్చిందని మమతా బెనర్జీ వెల్లడించారు.
అయితే, తమ పైలట్ చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినట్లు మమత చెప్పారు. విమానం గురించి ఏటీసీ, డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు.

కాగా, గత శుక్రవారం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన మమతా బెనర్జీ... ఆరోజు సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగుపయనమయ్యారు. అయితే, మధ్యలో విమానం భారీ కుదుపులకు గురైంది. పైలట్ చాకచక్యంతో విమానం కోల్కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంది.
అయితే, ఈ ఘటనలో మమతా బెనర్జీ వెన్నునొప్పికి గురైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. 'దసో ఫాల్కాన్ 2000' అనే విమానంలో మమత ప్రయాణించారు. 10.3 టన్నుల బరువుండే ఈ తేలికపాటి విమానంలో ఇద్దరు సిబ్బంది సహా గరిష్ఠంగా 19 మంది ప్రయాణించొచ్చు. కాగా, ఘటనపై స్పందిస్తూ వీఐపీల భద్రత విషయంలో ఎలాంటి పొరపాటు జరగదని డీజీసీఏ పేర్కొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications