Viral video: ఆలయంలో నీళ్లు తాగినందుకు... ముస్లిం బాలుడిపై విచక్షణారహితంగా దాడి
హిందూ దేవాలయంలో మంచినీళ్లు తాగేందుకు వెళ్లిన ఓ ముస్లిం బాలుడి(12)పై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అతన్ని కిందపడేసి కాళ్లతో తొక్కాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆ వీడియోను గమనిస్తే... దాడికి పాల్పడ్డ యువకుడు మొదట ఆ బాలుడిని నీ పేరేంటి... నీ తండ్రి పేరేంటి అని అడిగాడు. అందుకు అతను ఆసిఫ్,ఆదిఫ్ అని బదులిచ్చాడు. ఆ తర్వాత.. గుడిలో నీకేం పని అని ప్రశ్నించాడు. అందుకు ఆ బాలుడు... గుడిలో నీళ్లు తాగేందుకు వచ్చానని చెప్పాడు. అంతే.. ఆ యువకుడు రెచ్చిపోయి బాలుడిపై దాడి చేశాడు. అతన్ని కింద పడేసి కాళ్లతో తొక్కాడు. ఇదంతా ఆ యువకుడి స్నేహితుడు సెల్ఫోన్లో చిత్రీకరించాడు.
బాలుడిపై దాడి వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతన్ని శృంగి నందన్ యాదవ్గా గుర్తించారు. ఘజియాబాద్ పోలీస్ అధికారి ఒకరు ఈ ఘటనపై స్పందిస్తూ...'దాడి విషయం తెలియగానే వెంటనే రంగంలోకి దిగాం. నిందితుడిని బిహార్లోని భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వని కుమార్ యాదవ్ కుమారుడు శృంగి నందన్ యాదవ్గా గుర్తించి అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.' అని తెలిపారు. ఇదే నిందితుడు గతంలో మరో బాలుడిపై దాడి చేసిన వీడియో కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ దాడి ఘటనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ దీనిపై స్పందిస్తూ... 'ఇదేనా రామాయణం,గీత,వేదాలు నేర్పించిన జ్ఞానం... ఇదేనా వసుధైక కుటుంబం అంటే...' అని ప్రశ్నించారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ నినాదమంటే ఇదేనా... మత విద్వేషాలను,హింసను బీజేపీ ప్రేరేపిస్తోంది... అని విమర్శించారు.
According to a instagram account (hinduektasanghh), A muslim kid was mercilessly beaten for drinking water in a temple.
— Mohammed Zubair (@zoo_bear) March 12, 2021
Cc : @ghaziabadpolice @Uppolice pic.twitter.com/61ezNX0zMn