గోల్డెన్ టెంపుల్ తర్వాత మరో దారుణం: కపుర్తాలాలో కూడా వ్యక్తిని కొట్టిచంపారు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ శనివారం ఓ యువకుడిని భక్తులు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోపే రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.
నిజాంపూర్ గ్రామంలోని ఓ గురుద్వారా వద్ద పవిత్ర జెండా 'నిషాన్ సాహబ్'ను అపవిత్రం చేసేందుకు యత్నించాడంటూ ఓ వ్యక్తిపై భక్తులు ఆగ్రహంతో దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు మృతి చెందాడు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది
కాగా, పోలీసులు, ఏ ఇతర ఏజెన్సీలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. ఈ తరహా కేసులకు పంజాబ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా బాధ్యత వహిస్తాయంటూ ఆ సమయంలో గురుద్వారా నుంచి ఓ ప్రకటన వెలువడినట్లు సమాచారం. దీంతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడాలని అందులో కోరారు.
దాడికి ముందే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ.. అతడ్ని తమ ముందే విచారించాలంటూ స్థానికులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగిన గుంపు.. ఆ వ్యక్తిని కొట్టి చంపారు.
శనివారం గోల్డెన్ టెంపుల్లో దారుణం
అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో అపవిత్ర కార్యానికి ప్రయత్నించాడనే నెపంతో ఒక వ్యక్తిని అక్కడే ఉన్న ఓ గుంపు కొట్టి చంపింది. ఈ మేరకు వివరాలను పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. బాధిత వ్యక్తి రోజువారీ సాయంత్రం ప్రార్థన సమయంలో గోల్డెన్ టెంపుల్ లోపల రైలింగ్ మీదుగా దూకి, సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ముందు ఉంచిన కత్తిని తాకడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అడ్డుకున్న కొందరు సిక్కుల గుంపు.. అతడ్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
'ఈ సాయంత్రం ప్రార్థనల సమయంలో, ఒక వ్యక్తి కంచె దూకి పరివేష్టిత ప్రాంతంలోకి ప్రవేశించాడు. సిక్కులు ఆ సమయంలో ప్రార్థనలు చేసి నమస్కరిస్తున్నారు' అని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మీందర్ సింగ్ భండాల్ చెప్పారు.
'తలపై పసుపు గుడ్డ కట్టుకున్న సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువకుడు కంచె దూకాడు... లోపల ఉన్న వ్యక్తులు అతనిని పట్టుకుని కారిడార్కు తీసుకెళ్లారు, అక్కడ అతనిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతను మరణించాడు' అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మీందర్ సింగ్ తెలిపారు.
'అతను ఒంటరిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నందున అన్ని వివరాలు వెల్లడి చేయబడతాయి. మా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి, ఫుటేజీని జల్లెడపడుతున్నాయి. రేపు పోస్ట్మార్టం చేయబడుతుంది. అతను ఎక్కడి నుండి వచ్చాడో మేము ధృవీకరిస్తాము' అని పర్మీందర్ సింగ్ భండాల్ తెలిపారు.