భార్యకు మందులు కొనే స్తోమత లేక రూ. 700కు 2 నెలల కొడుకుని అమ్మేశాడు
మల్కన్గిరి: ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు మందులు కొనే స్తోమత లేక ఒ గిరిజనుడు రెండు నెలలు వయసున్న తన కుమారుడిని రూ. 700లకు అమ్మేసిన సంఘటన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
కోర్కుంద బ్లాక్లోని చిత్తపల్లి-2 గ్రామానికి చెందిన సుకురా మదులి, ధుముసీ మదులి అనే నిరుపేద దంపతులు గత ఫిబ్రవరిలో తమ కుమారుడిని సమీపంలోని చిత్తపల్లి-3 గ్రామానికి చెందిన ‘ఆశా' కార్యకర్తకు అప్పగించారని, దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి తమను ఆదేశించారని జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) అధ్యక్షుడు సంజుక్తా ప్రధాన్ వెల్లడించారు.
కుమారుడిని అమ్మేసిన గిరిజన దంపతులు ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తోన్న పేదరిక నిర్మూలన పథకాల ద్వారా గానీ, ఇందిరా ఆవాస్ యోజన ద్వారా గానీ ఎలాంటి ప్రయోజనం పొందలేదని తమ విచారణలో తేలిందని, అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు మందులు కొనుగోలుచేసే స్తోమత లేకపోవడం వల్లనే కుమారుడిని అమ్మేసినట్లు సకురా సిడబ్ల్యుసికి వివరించాడని ప్రధాన్ పేర్కొన్నారు.
సుకురా దంపతులకు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇంటిని, వేరే ఇతర పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. ప్రస్తుతం వీరి కుమారుడు ‘ఆశా' కార్యకర్త వద్దనే ఉన్నట్లు ప్రధాన్ తెలిపారు.