అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం.. కాలేజీ ఈవెంట్లో రెచ్చిపోయిన పోకిరీలు..
ఢిల్లీలోని గార్గి కాలేజ్లో నిర్వహించిన వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో పోకిరీలు రెచ్చిపోయారు. క్యాంపస్లోకి చొరబడ్డ కొంతమంది మూక అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. వారిపై దాడికి తెగబడింది. ఆశ్చర్యమేంటంటే.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
కాలేజీ క్యాంపస్లో పోకిరీల రచ్చ...
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాలేజీ క్యాంపస్లో రివెరీ పేరిట గురువారం సాయంత్రం 6.30గంటలకు ఈవెంట్ నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది మూక కాలేజీ ఎంట్రన్స్ వద్ద గుమిగూడారు. మద్యం మత్తులో ఉన్న ఆ పోకిరీలు.. కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కొంతమంది అమ్మాయిలను క్యాంపస్లో వెంటబడి తరిమారు.
దాదాపు 30-35 మంది
ఆ పోకిరీ మూకలో దాదాపు 30-35 మంది ఉంటారని.. వారిలో సగం మంది మద్యం మత్తులో ఉన్నారని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజీ అమ్మాయిలను వారు వెంటబడి తరిమారని.. ఆ క్రమంలో ఫస్టియర్ స్టూడెంట్స్ కిందపడి స్పృహ కూడా కోల్పోయారని అంటున్నారు. క్యాంపస్లోకి వచ్చి వారు స్మోక్ చేస్తున్న వీడియోలు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.
హస్త ప్రయోగం...
ఆరోజు సాయంత్రం ఈవెంట్ సమయంలో... కాలేజీ ఎంట్రన్స్ వద్ద గుంపు ఎక్కువగా ఉందని ఓ విద్యార్థిని చెప్పింది. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకుండా కిక్కిరిసిపోయినట్టు పేర్కొంది. ఆ సమయంలో కొంతమంది పోకిరీలు మూడుసార్లు అసభ్య చేష్టలతో తనను విసిగించారని తెలిపింది. అక్కడినుంచి బయటపడి ఖాళీ ప్రదేశానికి వెళ్లిన తర్వాత... ఓ వ్యక్తి తనవైపే చూస్తూ హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడని చెప్పింది. దీంతో అక్కడినుంచి పరిగెత్తానని.. తన వెనకాలే పరిగెత్తుకొచ్చిన ఓ ఫస్టియర్ విద్యార్థిని.. ఐదారుగురు వ్యక్తులు తనను వెంబడిస్తున్నట్టు చెప్పిందని తెలిపింది.
తమ దృష్టికి రాలేదన్న ప్రిన్సిపాల్
జరిగిన ఘటనను నిరసిస్తూ సోమవారం కాలేజీ విద్యార్థినులు కాలేజీ బయట నిరసనకు దిగారు. కాలేజీ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం,పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమకు ఆ పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. మరోవైపు ప్రిన్సిపాల్ ప్రొమీలా కుమార్... జరిగిన ఘటన తన దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. తాము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. పోలీసులు,బౌన్సర్లతో పాటు కమెండోలను కూడా పెట్టామని చెప్పారు. ఎప్పటికప్పుడు తాము రౌండ్స్ వేస్తూ పర్యవేక్షిస్తూనే ఉన్నామని.. అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్టు ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేని పోలీసులు వెల్లడించారు.