మంజురాణి: బాక్సింగ్ గ్లవ్స్ కొనే శక్తి లేదు.. కానీ భారత ఒలింపిక్స్ ఆశాకిరణంగా మారారు- BBC ISWOTY
ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ, విజయం అనేది పెద్ద విషయంకాదని మంజురాణి నిరూపించారు.
చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఏ ఆటనైనా దీక్షతో, నిబద్ధతో ఆడేవారు మంజురాణి.
హరియాణాలో రితాల్ ఫోగట్ గ్రామానికి చెందిన మంజురాణి తన తోటి పిల్లలంతా కబడ్డీ ఆడటం చూసి తాను జట్టులో చేరిపోయారు.
తాను మంచి కబడ్డీ ప్లేయర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె భావించేవారు. కొన్నాళ్లు కబడ్డీలో కొనసాగారు. కానీ తర్వాత విధి ఆమెను మరో బాటలో నడిపించింది.
- ISWOTY: టోక్యో ఒలింపిక్ క్రీడలపై జెయింట్ కిల్లర్ సోనమ్ మాలిక్ ఆశలు
- ISWOTY: ఒలింపిక్స్ పతకంపై ఆశలు చిగురింపజేస్తున్న ఈ యువ షూటర్ మీకు తెలుసా?
కొత్త స్వప్నం
ఆమె కబడ్డీలో చూపుతున్న ప్రతిభను గుర్తించిన ఆమె కోచ్ సహాబ్ సింగ్ నర్వాల్ ఆమెలో ఇంకెంతో శక్తి ఉందని భావించారు. ఇలా టీమ్గా కాకుండా, వ్యక్తిగత క్రీడల్లో ఆమె ఇంకా రాణిస్తారని అంచనా వేశారు. అదే విషయం ఆమెకు చెప్పారు.
తర్వాత ఆమె మనసు బాక్సింగ్ మీదకు మళ్లింది. 2012 లండన్ ఒలింపిక్స్లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన మేరీకోమ్ ఆమెలో స్ఫూర్తి రగిలించారు. మేరీకోమ్ స్ఫూర్తి, కబడ్డీ కోచ్ ప్రోత్సాహంతో ఆమె బాక్సింగ్ క్రీడకు మారారు.
నిర్ణయమైతే మార్చుకున్నారుగానీ అందుకు అవసరమైన శిక్షణ విషయంలో ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఆర్ధికంగా వనరులు అవసరమయ్యాయి.
సరిహద్దు భద్రతా దళంలో పని చేసిన ఆమె తండ్రి 2010లో మరణించారు. ఇంట్లో ఆమెతోపాటు ఆరుగురు పిల్లలున్నారు. వీరంతా తండ్రికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి జీవించాల్సిందే.
బాక్సింగ్లో రాణించాలని కోరుకుంటున్న తన కూతురి కలలను ఎలా సాకారం చేయాలో తల్లికి అర్ధం కాలేదు. ఆమెకు శిక్షణ ఇప్పించడం తల్లికి పెద్ద సవాలుగా మారింది.
ఆహార నియమాలు పాటిస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్న మంజురాణికి అప్పట్లో బాక్సింగ్ గ్లవ్స్ కొనడానికి కూడా చేతిలో డబ్బులుండేవి కావు.
కబడ్డీలో శిక్షణ ఇచ్చిన సహాబ్ సింగ్ నర్వాల్ బాక్సింగ్లో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తన ఊర్లోని పొలాల్లోనే మంజురాణి ప్రాక్టీస్ చేసేవారు.
- ISWOTY - సంధ్య రంగనాథన్: ఫుట్బాల్ ఆటలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు
- ISWOTY - శివానీ కటారియా: సమ్మర్ క్యాంపు నుంచి సమ్మర్ ఒలింపిక్స్ దాకా...
'స్వర్ణ’యుగం మొదలు
రాణి కుటుంబం దగ్గర ఆర్ధిక వనరులు లేకపోయినా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఉన్న కొద్దిపాటి వనరులతో శిక్షణ తీసుకున్న మంజురాణి, 2019లో జరిగిన సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలుచుకున్నారు.
అలా తొలి పతకాన్ని గెలుచుకుని క్రీడా ప్రపంచంలోకి తొలి అడుగును ఘనంగా వేశారు మంజురాణి. నేషనల్ ఛాంపియన్ షిప్ స్ఫూర్తిని కొనసాగించిన మంజురాణి రష్యాలో జరిగిన వరల్డ్ విమెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో ఫైనల్ వరకు వెళ్లారు. ఎంతో కష్టమైన ఈ పోటీలో ఆమె వెండిపతకం సాధించారు.
అదే సంవత్సరంలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియాల్ బాక్సింగ్ టోర్నమెంట్లో కూడా సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.
ఆరంభంలో సాధించిన విజయాలతో హరియాణా బాక్సింగ్ అసోసియేషన్ ఆమెకు 2024 పారిస్ ఒలింపిక్స్ గేమ్ లో బంగారు పతకం గెలవడం లక్ష్యంగా పెట్టింది.
కుటుంబ సహకారం ఉంటే భారతదేశంలో ఏ క్రీడాకారుడైనా, క్రీడాకారిణైనా అద్భుతమైన విజయాలను సాధిస్తారని రాణి బలంగా నమ్ముతారు. తన లక్ష్య సాధనలో కుటుంబం పాత్ర ఎనలేనిదని ఆమె చెప్పారు.
(బీబీసీ పంపిన ప్రశ్నావళికి మంజురాణి ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం)
ఇవి కూడా చదవండి:
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు..అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- స్టాండప్ కమెడియన్: వేయని జోకులకు జైలు శిక్ష అనుభవించిన మునావర్ ఫారూఖీ
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)