మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో బోయిన్పల్లి: ఆ ఘటనలు నన్నెంతగానో బాధ పెట్టాయి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను తనను తీవ్రంగా బాధపెట్టాయని మోడీ అన్నారు. కలచి వేశాయని చెప్పారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఏడాదికాలం పాటు కరోనా వైరస్పై నిరంతరాయంగా పోరాటం సాగించామని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మోడీ అన్నారు. 15 రోజుల్లో 30 లక్షల మందికి పైగా కరోనా ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాలతో పోల్చుకుంటే.. ఇది చాలా రెట్లు అధికమని అన్నారు. పలువురు విదేశీయులు.. దేశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాయని, భారత్లోని తమ మిత్రులకు లేఖలు రాస్తున్నారని చెప్పారు.
అర్జెంటీనా అధ్యక్షుడు దేశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంతగానో మెచ్చుకున్నారని మోడీ చెప్పారు. రామాయణంలోని సంజీవినితో భారత వ్యాక్సిన్ను పోల్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రపంచం గుర్తించని వీరులకు పద్మ అవార్డులను అందజేశామని చెప్పారు. అలాంటి వారి సేవలు, త్యాగాలను దేశ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించిందని, తొలి టెస్ట్ మ్యాచ్లో ఓటమి అనంతరం పుంజుకొని.. సిరీస్ను గెలిచిందని చెప్పారు. టీమిండియా పోరాట తత్వం ప్రతిబింబించిందని చెప్పారు.
హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్లో రోజూ 10 టన్నుల మేర కూరగాయలు వృధా అవుతున్నాయని, అందులో నుంచి విద్యుత్, బయో ఇంధనాన్ని తయారు చేస్తున్నారని మోడీ ప్రశంసించారు. బోయిన్పల్లి మార్కెట్ వినియోగానికి ఆ విద్యుత్ను వినియోగిస్తున్నారని చెప్పారు. వేస్ట్ నుంచి వెల్త్ను సృష్టించారని నరేంద్ర మోడీ అన్నారు. ఇలాంటి అద్భుతాలను సృష్టించడం ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనమని చెప్పారు.