జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు పీడీపీ మ్యానిఫెస్టో రిలీజ్-కాంగ్రెస్, అబ్దుల్లాలకు ముఫ్తీ ఆఫర్..!
జమ్మూ కాశ్మీర్ లో మూడు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తమ మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. తన అజెండాతో పోటీ చేస్తే వారితో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమన్నారు.
శ్రీనగర్లో ఇవాళ పీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ముఫ్తీ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు అజెండా ఆధారంగా పొత్తు పెట్టుకోవడం లేదని, సీట్ల పంపకాల ఆధారంగా పొత్తులు పెట్టుకుంటున్నాయని ఆరోపించారు. సీట్ల పంపకంపై మాత్రమే చర్చలు జరిగితే తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని ముఫ్తీ తేల్చిచెప్పేశారు. పొత్తుకూ, సీట్ల పంపకాలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. తమ అజెండా ఫాలో అవుతామంటే మాత్రం ఆ రెండు పార్టీలతో కలిసేందుకు సిధ్దమన్నారు.

జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారమే తమ పార్టీ అజెండా అని మెహబూబా ముఫ్తీ తేల్చిచెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని హిందూ పుణ్యక్షేత్రమైన శారదా పీఠ్కు వెళ్లే మార్గాన్ని తెరవాలని పీడీపీ కోరుకుంటోందని ఆమె తెలిపారు. అలాగే 2019 నుంచి నిలిపేసిన వాణిజ్యాన్ని పునరుద్దరించేలా పాకిస్తాన్ తో చర్చలు జరపాలని ముఫ్తీ కోరారు. మరోవైపు పీడీపీ మ్యానిఫెస్టోలో ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ముఫ్తీ తెలిపారు. దేవాలయాలు, మసీదులు , గురుద్వారాలకు తమ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తుందని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని పెంచుతామన్నారు. జైల్లో ఉన్న వారికి ఉచిత న్యాయం పొందే సదుపాయం కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications