అంబానీకి బాంబు బెదిరింపు: సచిన్ వాజే మెర్సిడెజ్ సీజ్.. స్కార్పియో ఒరిజినల్ నంబర్ ప్లేట్ స్వాధీనం?
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం రేపిన ఘటనలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అనుమానుతుడిగా ఉన్న ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) మాజీ హెడ్ సచిన్ వాజే బ్లాక్ మెర్సిడెజ్ కారును తాజాగా పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు,అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం ఒరిజినల్ నంబర్ ప్లేటును కూడా ఇదే మెర్సిడెజ్ కారులో గుర్తించినట్లు చెప్తున్నారు.
జాతీయ మీడియా కథనం ప్రకారం ముంబైలోని క్రాఫర్డ్ మార్కెట్ ప్రాంతంలో సచిన్ వాజేకి చెందిన మెర్సిడెజ్ కారును ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కారును సచిన్ వాజే ఉపయోగిస్తున్నప్పటికీ... దాని అసలు యజమాని వేరే ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రూ.5లక్షలు నగదు,కొన్ని దుస్తులు,పెట్రోల్,డీజిల్,కరెన్సీ కౌంటింగ్ మెషీన్ను కూడా అదే కారులో లభ్యమైనట్లు ఎన్ఐఏ ఐజీ అనిల్ శుక్లా తెలిపారు.
సోమవారం(మార్చి 15) రాత్రి ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్లో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఒక ల్యాప్టాప్,ఐప్యాడ్,ఫోన్,డీవీఆర్ల(డిజిటల్ వీడియో రికార్డర్)తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏడుగురు పోలీసుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా,ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో ఓ స్కార్పియో వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అందులో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. భద్రతా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని... భవిష్యత్తులో అంబానీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని పేలుళ్లు జరుపుతామని జైషుల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది.
ఆ స్కార్పియో యజమాని హిరెన్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్. అయితే ఆ స్కార్పియో తనది కాదని అంతకుముందు విచారణలో హిరెన్ వెల్లడించాడు. డా.శ్యామ్ న్యూటన్ అనే వ్యక్తి కారుకు కొన్ని భాగాలు అమర్చాల్సిందిగా తన డెకార్ షాపులో అప్పగించినట్లు తెలిపాడు. అయితే డబ్బులు చెల్లించలేని కారణంగా ఆ కారును తననే వాడుకోమని అతను చెప్పినట్లుగా తెలిపాడు. దీంతో హిరెనే ఆ వాహనాన్ని వాడుకోగా.. ఒకరోజు మార్గమధ్యలో ఆగిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లానని... మరుసటిరోజు వెళ్లేసరికి అది చోరీకి గురైందని చెప్పాడు.
ఇదే స్కార్పియో వాహనాన్ని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ఉపయోగించారని... హిరెన్ భార్య ఎన్ఐఏ అధికారులకు వెల్లడించారు. నవంబర్,2020 నుంచి ఫిబ్రవరి 5 వరకూ ఆయనే ఉపయోగించుకున్నారని తెలిపారు. ఫిబ్రవరి 5న వాహనం తిరిగివ్వగా... ఆ తర్వాత 12 రోజులకు చోరీకి గురైందన్నారు. అంతేకాదు, సచినే తన భర్తను హత్య చేసి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సచిన్ వాజేపై ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై వేటు కూడా వేసింది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న ఈ కేసు చివరకు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.