నాదెళ్లకు ప్రవాసీ భారతీయ సమ్మాన్: ఐరాస్ డిఎఫ్ఎస్ అధిపతిగా ఖరే
అహ్మదాబాద్/న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఈవోగా వ్యవహరిస్తున్న ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్లకు మరో పురస్కారం లభించింది. నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.
గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతరతోపాటు మరో పదిహేను మందికి గుజరాత్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ చివరి రోజు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ అవార్డులను అందచేయనున్నారు.
అవార్డు అందుకోనున్నవారిలో మలా మెహతా, కన్వల్ జీత్ భక్షి, నందిని టాండన్, ఆష్రాఫ్ పలరకుమ్మాల్, రాజ్మాల్ ఎం పరాఖ్, సంజయ రాజారామ్, జస్టిస్ దొరైకన్ను కరుణాకరణ్, లార్డ్ రాజ్ లుంబా,మహేంద్ర నానీ, కమ్లేష్ లుల్లా, నాథూరామ్ పూరి ఉన్నారు.
ఐరాసలో డిఎఫ్ఎస్ అధిపతిగా అతుల్ ఖరే
న్యూయార్క్: భారతీయ దౌత్యవేత్త అతుల్ ఖరేకు ఐక్యరాజ్య సమితిలో ఉన్నత అధికార హోదా దక్కింది. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అనుభవజ్ఞుడైన ఆయనను క్షేత్ర తోడ్పాటు విభాగం(డిఎఫ్ఎస్) అండర్ సెక్రటరీ జనరల్గా నియమించారు. డిఎఫ్ఎస్ ప్రపంచ వ్యాప్తంగా శాంతి పరిరక్షక కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తుంది.
బంగ్లాదేశ్కు చెందిన అమీహక్ స్థానంలో ఖరే బాధ్యతలు చేపట్టనున్నారు. తన నియామకంపై స్పందిస్తూ.. శాంతి, సుస్థిరతను ప్రోత్సహించేందుకు బాన్ కీ మూన్ చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడటం కోసం ఎదురుచూస్తున్నానని ఖరే తెలిపారు.