కేంద్రం అనూహ్య చర్య- ప్రత్యేక పార్లమెంట్ భేటీకి పిలుపు: ప్రతిపక్షం బలపడుతున్నవేళ..?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు మూడో విడత భేటీకి సన్నద్ధం అయ్యాయి. నేడు, రేపు ముంబైలో భేటీ అయ్యారు. 28 పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరుల్లో భేటీ అయ్యారు. మూడోసారి ముంబైలో ఉమ్మడి భేటీని నిర్వహించబోతోన్నారు. ఇప్పటికే భాగస్వామ్య పార్టీల అధినేతలు ముంబైకి చేరుకున్నారు. ఈ విడత సమావేశంలోనే ఇండియా లోగోను ఆవిష్కరించనున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బిహార్, ఢిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరేతో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. హయత్ గ్రాండ్ హోటల్లో ఈ సమావేశం కొనసాగుతోంది.
ప్రతిపక్షాలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పార్లమెంట్ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమృత కాల సమయంలో కొన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications