వివాదాస్పదం: ‘మహా’ విషాదంలో సెల్ఫీతీసుకున్న మంత్రి
ముంబై: మరో మహారాష్ట్ర మంత్రి సెల్ఫీతో చిక్కుల్లో పడ్డారు. గతంలో మంత్రి పంకజా ముండే సెల్ఫీ తీసుకుని వివాదంలో పడ్డ విషయం తెలిసిందే. తాజాగా, మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన వద్ద సెల్ఫీ తీసుకుని ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా చిక్కుల్లో పడ్డారు. ముంబై-గోవా రహదారిపై మహద్ వద్ద బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన సావిత్రి నది ఉద్ధృతికి కుప్పకూలిన విషయం తెలిసిందే.
నదిలో దాదాపు 50 మంది గల్లంతవ్వగా , సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికి తీశారు. కాగా, ఈ ప్రాంతాన్ని బుధవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విక్కీ పాటిల్ సందర్శించారు. వారితో పాటు వచ్చిన ప్రకాశ్ మెహతా సెల్ఫీ తీసుకోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ఈ దుర్ఘటన గురించి ప్రకాశ్ను మీడియా ప్రశ్నిస్తూ.. 'ఈ విషయం మీకు చాలా ఆలస్యంగా తెలిసిందా?' అని అడగడంతో.. ప్రకాశ్ ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో మీడియా ప్రతినిధులు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
మంత్రి ప్రకాశ్ సెల్ఫీ తీసుకోవడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశ్ మెహతా ప్రవర్తన ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతోందని ఎన్సీపీ విమర్శించింది. అయితే, తాను సెల్ఫీలు ఏమీ తీసుకోలేదని మంత్రి ప్రకాశ్ చెప్పుకొచ్చారు.