అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ప్రతిపక్షంలో చేరిన మంత్రి సోదరి, మేనల్లుడు ?
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి. ఎలాగైనా మరోసారి కర్ణాటకలో అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ హైకమాండ్ కు కర్ణాటకలోని బీజేపీ నాయకులు వరుస రాజీనామాలు చెయ్యడంతో ఆ పార్టీకి ఊహించని దెబ్బలు పడుతున్నాయి.
ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో సహ మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుస రాజీనామాలు చెయ్యడంతో బీజేపీ హైకమాండ్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. గుజరాత్ లో చేసిన ప్రయోగాలు కర్ణాటకలో చెయ్యడానికి ప్రయత్నించిన బీజేపీ హైకమాండ్ కు మైండ్ బ్లాక్ అయ్యింది.

గుజరాత్ ప్రయోగాలు కర్ణాటకలో పనికిరావు అని బీజేపీ హైకమాండ్ అర్థం చేసుకునేలోపు ఊహించని రీతిలో బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కర్ణాటక మంత్రి, విజయనగర బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (బీజేపీ) ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. మంత్రి ఆనంద్ సింగ్ తాను ఎన్నికల్లో పోటీ చెయ్యనని బీజేపీ హైకమాండ్ కు చెప్పారు.

మంత్రి ఆనంద్ సింగ్ సోదరి, కర్ణాటక రాష్ట్ర బీజేపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రాణి సంయుక్తా సింగ్ విజయనగర బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు. ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ దగ్గర రాణి సంయుక్తాకు మంచి పలుకుబడి ఉండటంతో ఆమెకు కచ్చితంగా బీజేపీ సీటు ఇస్తారని అందరూ అనుకున్నారు.
అయితే మంత్రి ఆనంద్ సింగ్ మాత్రం ఆయన కుమారుడు సిద్దార్థ్ సింగ్ కు టిక్కెట్ ఇప్పించుకున్నారు. విజయనగర బీజేపీ అభ్యర్థిగా సిద్దార్థ్ సింగ్ బరిలో దిగారు. అప్పటికే కాంగ్రెస్ టిక్కెట్ గవియప్పకు ఇచ్చేశారు. మేనల్లుడు సిద్దార్థ్ సింగ్ కు బీజేపీ సీటు ఇచ్చి తనను మోసం చేసిన బీజేపీకి రాణి సంయుక్తా రాజీనామా చేశారు.
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా సమక్షంలో రాణి సంయుక్తా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాణి సంయుక్తా మేనల్లుడు సిద్దార్థ్ సింగ్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా విజయనగరలో ప్రచారం చెయ్యడానికి సిద్దం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications