అధికార మదం: ఆ మంత్రి కొడుకు ఏంచేశాడో చూడండి
అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నారు బీజేపీ నేతల కుమారులు. సామాన్య పబ్లిక్పై విరుచుకుపడుతున్నారు ఈ అధికార నేతల పుత్రరత్నాలు. ఇదేమని ప్రశ్నిస్తే మాకే ఎదురు చెబుతావా అంటూ దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్లో చోటుచేసుకుంది. జూన్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసింగ్ రావత్ కుమారుడు రాజా తన కారును అత్యంత వేగంగా నడిపి మరో కారును ఓవర్ టేక్ చేశాడు. అనంతరం ఆ కారుకు రాజా కారు అడ్డంగా నిలిపాడు. ఆ వెంటనే తన కారులోనుంచి బయటకొచ్చి మరో కారుడ్రైవర్ చెంప చెల్లు మనిపించాడు. నీరవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఆ కారును నడుపుతున్నాడు.
రాజాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నీరవ్ పై దాడికి దిగారు. ఇది ఒక నెల క్రితమే జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దాడి ఘటన దృశ్యాలన్నీ సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన జరిగి ఒక నెల కావొస్తోందని ఇరు వర్గాల వారు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని బన్స్వారా ఎస్పీ కాలు రామ్ రావత్ తెలిపారు.
బాధితుడు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తీసుకొచ్చారని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తెలిపారు. బాధితుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కనుక తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు రిటైర్డ్ పోలీస్ అధికారి. దాడి చేసిన వర్గం అధికార రాజకీయపార్టీ కావడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసేందుకు జంకుతున్నారన్నారు. దాడి ఘటన వీడియో బయటకు రాగానే విపక్షాలు అధికార బీజేపీపై ధ్వజమెత్తాయి.
పోలీసులు వెంటనే రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఘటనపై స్పందిచారు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్. దాడి ఘటనను ఆయన ఖండించారు. అధికారంలో ఉన్నవారు ఏదైన చేయొచ్చనేలా నేతలు వారి పిల్లలు ప్రవర్తిస్తున్నారని సచిన్ పైలట్ విమర్శించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు అనేలా ఈ ప్రభుత్వం నేతలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.