సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం
Recommended Video
చెన్నై: తమిళనాడు రాజకీయాలను ఐదు దశాబ్దాలకుపైగా శాసించిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు లక్షలాది అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ అభిమాన నేత లేరంటే జీర్ణించుకోలేకపోతున్నామంటూ గుండెలు బాదుకుంటున్నారు.
రాజకీయ ప్రవేశం చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కరుణానిధి.. తమిళ ప్రజల నమ్మకాన్ని చూరగొని ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ద్రవిడ సంస్కృతి రక్షకుడిగా పేరు తెచ్చుకున్నారు.
అసలు పేరు దక్షిణమూర్తి.. తొలి ద్రవిడ సంఘం
తమిళనాడులోని తిరుక్కువాలైలో 1924 జూన్ 3న కళైంజర్(కళాకరుడు) ముథువేల్ కరుణానిధి జన్మించారు. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. కాగా, ఆయన బాల్యంలోనే నాటికల రచన, సాహిత్యంపై మొగ్గుచూపించేవారు. అప్పట్లో జస్టిస్పార్టీ నేతృత్వంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బలంగా ఉండేవి. వీటి ప్రభావంతో విద్యార్థిగా ఉన్నప్పుడే మరి కొందరు సహచరులతో కలిసి ‘ఆల్స్టూడెంట్క్లబ్' అనే సంస్థను నెలకొల్పాడు. ద్రవిడ ఉద్యమంలో ఇదే తొలి విద్యార్థి సంఘం కావడం గమనార్హం. కల్లుకుడిలో జరిగిన ఉద్యమంలో కరుణానిధి చురుగ్గా పాల్గొన్నారు.
సినీ రచయితగానూ..
కరుణానిధి తమిళ సినిమాలకు స్క్రీన్ప్లే రాయడం ప్రారంభించారు. ‘పరాశక్తి' లో సంప్రదాయవాదాన్ని ఆయన తప్పుబట్టారు. అదే సమయంలో అంటరాని తనం, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకపోరాటం, ఆత్మాభిమానం.. తదితర అంశాలపై ఆయన రాసిన రచనలు సినిమాల్లో అస్త్రాలుగా మారాయి. నాస్తికవాదానికి మద్దతుగా అనేక రచనలు చేశారాయన.
ఓటమి ఎరుగని నేత
ద్రవిడ ఉద్యమంలోనూ కరుణానిధి కీలకంగా వ్యవహరించారు. ఈవీ రామస్వామి పెరియార్, అన్నాదురైలతో పాటు కరుణాధి కూడా ఈ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 33 ఏళ్ల వయస్సులో ఆయన తొలిసారిగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు కరుణానిధి పోటీచేసిన ప్రతిసారీ విజయం సాధించడం గమనార్హం.
డీఎంకే స్థాపనలో కీలకం
ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) స్థాపనలోనూ కరుణానిధి కీలక భూమిక వహించారు. 1967లో తొలి సారిగా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నాదురై సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1969లో కన్నుమూయడంతో కరుణ పగ్గాలు అందుకున్నారు.
ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే...
అయితే, సినీనటుడు ఎంజీ రామచంద్రన్ పార్టీ నుంచి వెళ్లిపోయి అన్నాడీఎంకే పేరుతో కొత్త రాజకీయపక్షాన్ని నెలకొల్పారు. అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించడంతో సుదీర్ఘకాలం కరుణానిధి ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణాంతరం జరిగిన ఎన్నికల్లో డీఎంకే మళ్లీ ఘనవిజయం సాధించడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు కరుణానిధి. కాగా, ఎంజీఆర్ తరువాత అన్నాడీఎంకే కార్యదర్శిగా జయలలిత ఎంపికయ్యారు.
కరుణ వ్యూహాలకు తిరుగులేదు
అంతేగాక, తమిళ రాజకీయాల్లో ఆయన వ్యూహాలకు తిరుగుండేది కాదు. ఒక సారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హవాను ఆయన ముందే ఊహించారు. వెంటనే చిరకాల మిత్రపక్షం కాంగ్రెస్ను వదిలి బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అనంతరం బీజేపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్కు స్నేహహస్తం అందించారు. పెద్ద పెద్ద రాజకీయ పండితులు కూడా పసిగట్టలేని పరిస్థితులను ఆయన ముందుగానే గుర్తించేవారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏలో కీలక భాగస్వామిగా వ్యవహరించారు. 2009లో తమిళటైగర్లపై శ్రీలంక సైన్యం చేపట్టిన సైనికచర్యను నిరసిస్తూ నిరాహారదీక్షకు దిగడం సంచలనం సృష్టించింది. అంతేగాక, తమిళులు, ద్రవిడ సంస్కృతి కోసం ఆయన కేంద్రంతోనూ పోరాటం చేసేందుకు వెనుకాడేవారు కాదు.
తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర.. ప్రజల కోసం..
కాగా, తమిళ రాజకీయాల్లో కరుణానిధి తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర జనాభాలో ఎక్కువమంది పేదవారు ఉండటంతో వారి సంక్షేమానికి కరుణానిధి పలు ప్రజాకర్షకపథకాలను అమలుచేసి వారికి మరింత చేరువయ్యారు. ఉచిత టీవీల పంపకం ఆయన ప్రవేశపెట్టినదే. ఆయన పథకాల విజయాన్ని గమనించిన జయలలిత కూడా అదే బాటలో నడవడం విశేషం. కరుణానిధి మరణంతో తమిళ రాజకీయాల్లో ఓ శకం ముగిసినట్లయింది. ఇటు రాజకీయ, అటు సినీ రంగంలోనే కరుణానిధి తనదైన ముద్ర వేశారు. కాగా, గత కొంత కాలం క్రితం జయలలిత కూడా మరణించిన విషయం తెలిసిందే.
ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం
కాగా, కరుణానిధికి ముగ్గురు భార్యలు దయాలు అమ్మాళ్, రజథి అమ్మాళ్, పద్మావతి ఉన్నారు. ఆయనకు ఆరుగురు సంతానం ఎంకే ముత్తు, ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, ఎంకే తమిళరసు, ఎంకే సెల్వి, ఎంకే కనిమొళి. తన తర్వాత డీఎంకేను సమర్థవంతంగా నడిపించగల వారసుడు ఎంకే స్టాలిన్ అని నమ్మిన కరుణానిధి ఆయనకే పార్టీ పగ్గాలను అప్పగించారు.