మాట్లాడుతుంటే కాస్త దూరం!: ఎస్పీజీకి మోడీ, హ్యాపీ..
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ నాయకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను కలిసిన పార్టీ నేతలు తనతో స్వేచ్ఛగా మాడ్లాడి, వారు సంతోషపడేలా మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు.. కొంత ఎడంగా ఉండాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కు మోడీ సూచించారు.
తనకు భద్రత కల్పిస్తున్న ఎస్పీజీ బృందానికి మోడీ సోమవారం ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. తనకు మరీ దగ్గరగా కాకుండా కాస్త ఎడం పాటించాలని వారితో చెప్పారట.
మోడీని కలిసేందుకు పలువురు పార్టీ నేతలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మోడీకి ఉన్న ఎస్పీజీ ప్రొటెక్షన్ను చూసి వారు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొంత ఎడం పాటించాలని వారికి మోడీ సూచించారట.
అంతేకాకుండా గతంలో ఎస్పీజీకి డిప్యూటేషన్ పై వచ్చిన ఓ ఐపీఎస్ అధికారి అప్పటి ప్రధాని మాటలను విని లీక్ చేయడంతో అతడిని పాత క్యాడర్కు తిప్పి పంపారు. అలాంటి ఘటనల నేపథ్యంలోనే ప్రధాని మోడీ తాజా నిర్ణయం తీసుకొని ఉంటారని అంటున్నారు.