రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతుండగా, కొవిడ్పై రాజకీయాలు సైతం అదే స్థాయికి చేరాయి. విపత్తు నిర్వహణలో కేంద్ర సర్కారు విఫలమైందంటూ సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీవ్ర కామెంట్లు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండటం, ఆక్సిజన్ కొరత, రెమ్డెసివీర్ లాంటి అత్యవసర మందులు, వ్యాక్సిన్ల కొరతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతోన్న క్రమంలో కేంద్రం అనూహ్య చర్యలకు ఉపక్రమించింది..
షాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికి
ఆ ట్వీట్లపై కేంద్రం ఫిర్యాదు
గడిచిన కొద్ది వారాలుగా దేశంలో కొత్త కేసులు, మరణాలు భారీగా పెరగడం, మందులు, ఆక్సిజన్ కొరత వల్ల కూడా మరణాలు సంభవించిన నేపథ్యంలో బీజేపీ యేతర నేతలతోపాటు కొందరు సెలబ్రిటీలు, సాధారణ పౌరులు సైతం కేంద్రం తీరును తప్పుపడుతూ విమర్శనాత్మక ట్వీట్లు చేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సమయంలో అలాంటి ట్వీట్లు ప్రజల్ని మరింత గందరగోళానికి గురిచేసేలా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సదరు ట్వీట్లను తొలగించాలంటూ ట్విటర్ సంస్థకు ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం ప్రకారం చర్యలు కోరగా, ట్విటర్ సంస్థ మొత్తం 52 ట్వీట్లను బ్లాక్ చేసింది. వాటిలో..
నిషేధిత జాబితాలో రేవంత్ రెడ్డి
కరోనా నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్రం చేపట్టిన చర్యలను విమర్శిస్తూ గడిచిన వారం రోజుల వ్యవధిలో పోస్టయిన మొత్తం 52 ట్వీట్లపై ట్విటర్ సంస్థ నిషేధం విధించింది. ఈ నిషేధిత జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఆక్సిజన్, అత్యవసర మందుల కొరతను ప్రస్తావిస్తూ, మోదీ సర్కారుపై విమర్శలు చేస్తూ రేవంత్ చేసిన పోస్టును ట్విటర్ బ్లాక్ చేసింది. రేవంత్ రెడ్డితోపాటు పశ్చిమ బెంగాల్ మంత్రి మోలాయ్ ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రి, అవినాష్ దాస్ తదితరుల ట్వీట్లు సైతం బ్లాక్ అయ్యాయి.
సోషల్ మీడియాపై సర్కార్ నజర్
కరోనా రెండో దశ వ్యాప్తిలో భారత్ అతి తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో మోదీ సర్కారు వైఫల్యాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో లక్షల కొద్దీ కామెంట్లు పోస్టవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు సాధారణ ప్రజలు సైతం కోవిడ్ కష్టాలను, సర్కారు అససత్వాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక దశలో ప్రభుత్వ వాదన కంటే వ్యతిరేక పోస్టులే వైరల్ అవుతోన్న పరిస్థితి నెలకొంది.
దీనికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం సోషల్ మీడియాపై సైతం నిఘాను పెంచింది. ఎంపీలు, మంత్రులు, సెలబ్రిటీలు చేసిన 52 ట్వీట్లపై నిషేధం అందులో బాగమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలుస్తోంది. కాగా, సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం చర్యలకు దిగడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఉద్యమానికి మద్దతుగా పోస్టయిన వందలాది ట్వీట్లపై కేంద్రం అభ్యంతరం చెప్పడంతో వాటిని ట్విటర్ బ్లాక్ చేసింది. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది.