చైనాకు మరో భారీ షాక్ ఇవ్వనున్న మోడీ సర్కారు: రూ. 12వేలలోపు ఫోన్లపై నిషేధం!
న్యూఢిల్లీ: చైనాకు మరో భారీ షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది భారత ప్రభుత్వం. చైనీస్ కంపెనీలకు చెందిన రూ. 12,000 ($150) కంటే తక్కువ ధరకు స్మార్ట్ఫోన్ పరికరాలను విక్రయించడాన్ని పరిమితం చేయాలని కేంద్రం యోచిస్తోందని, దాని దేశీయ పరిశ్రమను ప్రారంభించేందుకు కేంద్రం యోచిస్తోందని వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ సోమవారం నివేదించింది.
చైనా మొబైళ్లకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కారు అడుగులు
ఆ నివేదిక ప్రకారం.. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అమలు చేయబడితే.. షియోమి కార్ప్తో సహా చైనీస్ బ్రాండ్లకు తీవ్రమైన దెబ్బ తగలవచ్చు. రూ. 12వేల రూపాయల్లోపు ధరలో మొబైల్లను విక్రయించకుండా నిషేధం విధించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చైనా మొబైల్ తయారీ కంపెనీల ప్రవేశంతో కుంగిపోయిన దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ తన కథనంలో పేర్కొంది.
భారత మార్కెట్పై చైనా కంపెనీల పెత్తనం
ఒకప్పుడు దేశంలో స్థానిక స్మార్ట్ఫోన్ కంపెనీలదే హవా కొనసాగింది. లావా, మైక్రోమ్యాక్స్ కంపెనీల ఫోన్లే ఎక్కువగా కనిపించేవి. కానీ, చైనా కంపెనీల ప్రవేశంతో దాదాపు ఈ కంపెనీల ఫోన్లు కానరాకుండా పోయాయి. ప్రధానంగా షావోమి, రియల్మీ, ఒప్పో, వివో కంపెనీలు భారత స్మార్ట్ఫోన్ వచ్చి.. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ పై పెత్తనం చెలాయిస్తున్నాయి. బడ్జెట్ ఫోన్ తయారీలో వీటిదే హవా కొనసాగుతోంది. రూ. 12వేల లోపు ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో చైనా కంపెనీల వాటానే 80 శాతం ఉండటం గమనార్హం.
చైనా కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టి.. స్వదేశీకి పట్టం
ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు రూ. 12వేల ధరలోపు స్మార్ట్ ఫోన్ విక్రయాలపై నిషేధం విధించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే షావోమీ, రియల్మీ వంటి కంపెనీలకు గట్టిదెబ్బే అని చెప్పవచ్చు. అదే సమయంలో దేశీయ కంపెనీలకు పునరుజ్జీవం పోసినట్లవుతుంది. ఈ నిర్ణయం వల్ల యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. వీటి ధరలు రూ. 12 వేలకుపైగానే మొదలవుతాయి. ఇప్పటికే చైనా యాప్ లకు చెక్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు చైనా మొబైళ్లను కూడా కట్టడి చేయడంతో దేశీయ మొబైల్ సంస్థలకు మేలు జరిగే అవకాశం ఉంది.