ములాయంకి మాయా నో, దొంగిలించు: మోడీపై సోనియా
న్యూఢిల్లీ/లక్నో: ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యవర్తిత్వం నెరపితే బహుజన సమాజ్ వాది పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమని ప్రకటించిన సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి గట్టి షాకిచ్చారు. ములాయం ప్రతిపాదనను ఆమె బుధవారం తిరస్కరించారు. ఆమె ములాయం పైన, ఎస్పీ పైన మండిపడ్డారు.
ఎస్పీ అధినేత ములాయం రాజకీయ అవకాశవాది అని, అధికారంలోకి వచ్చే అంశం గురించే ఆయన ఆలోచిస్తారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఎస్పీ, బీజేపీ కలసి పని చేస్తున్నాయని, అలాంటప్పుడు తామెలా చేతులు కలుపుతామన్నారు. యూపీలో ఎవరితోనూ కలవబోమని, ఒంటరిగానే తలపడతామని స్పష్టం చేశారు.

మోడీ మా ఐడియాలు కాపీ కొడుతున్నారు: సోనియా
నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం మరోసారి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం యూపీఏ పథకాలను దొంగిలిస్తోందని, కొత్తగా ఆ ప్రభుత్వం చేపడుతున్నదేమీ లేదని విమర్శించారు. దేశానికి బీజేపీ కొత్తగా అందించడానికి ఏమీ లేదన్నారు. వారిక తమ ఐడియాలు దొంగిలించవచ్చన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన పథకాలన్నీ యూపీఏ హయాంలోనివేనన్నారు. ఈ పది వారాల పాలనలో బీజేపీ కొత్తగా దేశానికి ఏం చేయలేదన్నారు. వారు తమ పైన విమర్శలు గుప్పించడం, పద్ధతి లేకుండా పాలించడం మినహా ఏం చేయడం లేదన్నారు.
బీజేపీ వారు యూపీఏ ఐడియాలు దొంగిలించవచ్చునన్నారు. వారు దొంగిలించుకునేందుకు తాము స్వాగతం పలుకుతున్నామన్నారు. బీజేపీ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. పెరుగుతున్న ధరలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ధరల పైన వారు యూపీఏ ప్రభుత్వాన్ని ఏంతకాలం లక్ష్యంగా చేసుకోగలరన్నారు.












Click it and Unblock the Notifications