కేసీఆర్, మమతా బెనర్జీ కోసం బ్లూప్రింట్ సిద్ధం చేసిన మోడీ, షా??
సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి భారతీయ జనతాపార్టీ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి వరుసగా మూడో విజయం కూడా సాధిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది. నరేంద్రమోడీ, అమిత్ షా మీద ఎక్కువ భరోసా ఉంచిన పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా ఉన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా వరుసగా మూడుసార్లు అధికారాన్ని ఇప్పటివరకు దక్కించుకోలేదు.

పార్టీలకు పాఠం చెబుతున్న మోడీ, షా
లోక్సభ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు సీరియస్గా తీసుకోవు. వాటికి రాష్ట్రాల్లో అధికారమే ముఖ్యం. కానీ మోడీ, అమిత్ షా ద్వయం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారం సాధిస్తే రాష్ట్రాల్లో ఎలా పాగా వేయవచ్చో అన్ని పార్టీలకు పాఠం చెబుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కువ లోక్సభ ఎన్నికలను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇది కొంతవరకు బీజేపీకి ఇబ్బంది కలిగించే పరిణామమని చెప్పవచ్చు.

బీజేపీ మేధోమథనం
రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు సొంతంగానే మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో కూడా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉంది. దీనికోసం గత ఎన్నికల్లో ఎక్కడ తాము రెండో స్థానంలో నిలిచాం.. ఏ నియోజకవర్గంలో మూడోస్థానాన్ని సాధించాం.. గట్టిగా ప్రయత్నిస్తే గెలవగలిగే నియోజకవర్గాలేంటి? అక్కడ అమలు చేయాల్సిన ప్రణాళికలు?.. తదితర విషయాలపై మేధోమథనం నిర్వహించింది. అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, భూపేందర్ యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయ తదితరులు హాజరయ్యారు.

ఐదు రాష్ట్రాల్లో 144 నియోజకవర్గాలు
పైన పేర్కొన్న విధంగా అటువంటి నియోజకవర్గాలు 144 ఉన్నాయని గుర్తించారు. అవి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్రలో ఉన్నాయి. వీటిని కొన్ని క్లస్టర్లుగా విడదీసి ఒక్కో కేంద్ర మంత్రిని ఇన్ఛార్జిగా ఉంచారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులేంటి? పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులను గుర్తించడంలాంటివన్నీ కేంద్ర మంత్రులు పూర్తిచేస్తారు. ఓటర్ల సంఖ్య ఎంత? తగ్గారా? పెరిగారా? తగ్గితే అందుకు కారణాలేంటి? సామాజికవర్గాల్లో ఎవరి ప్రాబల్యం ఎక్కువ? తదితర విషయాలను క్రోడీకరించుకొని ఒక బ్లూ ప్రింట్ను గెలుపునకు ప్రాతిపదికగా బీజేపీ సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఆ పార్టీ మమతా బెనర్జీ, కేసీఆర్ ప్రాబల్యంపైనే దృష్టిసారించింది. ఇక ప్రచారానికి వెళ్లడమే తరువాయి.!!












Click it and Unblock the Notifications