తెలంగాణ బిల్లుపై బాధ్యత మాది: కెసిఆర్తో ప్రధాని
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసే బాధ్యత తమదేనని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు హామీ ఇచ్చారు. బుధవారంనాడు రాజ్యసభకు తెలంగాణ బిల్లు రాకపోవడంతో కెసిఆర్ ప్రధానికి ఫోన్ చేశారు. బిజెపి ప్రతిపాదించదలచిన సవరణల గురించి కెసిఆర్ ప్రధానిని అడిగారు. తెలంగాణ బిల్లుపై రేపు రాజ్యసభలో చర్చిస్తామని ప్రధాని చెప్పారు. ఈ విషయాన్ని కెసిఆర్ తన పార్టీ శాసనసభ్యులకు చెప్పారు.
రాజ్యసభలో సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత తిరిగి ఐదు గంటలకు ప్రవేశపెడతారని భావించారు. రాజ్యసభ వాయిదా పడి తిరిగి సాయంత్రం ఐదు గంటలకు సమావేశమైన తర్వాత బిల్లును ప్రవేశపెట్టలేదు. బిల్లును ప్రవేశపెట్టక ముందే డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేసింది.
అయితే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో బిజెపి నేతలు అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. బిల్లుపై వారు నాలుగు సవరణలను సూచించినట్లు సమాచారం. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ప్రధాని అంగీకరించలేదని సమాచారం. దీంతో బిల్లును బుధవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టలేదని తెలుస్తోంది.
అయితే, సవరణల జోలికి వెళ్లకుండా ప్రధానితో రాజ్యసభలో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన చేయిస్తే బాగుంటుందని కాంగ్రెసు అధిష్టానం ఆలోచించినట్లు తెలుస్తోంది. సవరణలను ప్రతిపాదిస్తే మళ్లీ మంత్రివర్గం ముందుకు, లోకసభకు వెళ్లాల్సి ఉంటుందనే ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సవరణలు ఏవీ లేకుండా బిజెపి మద్దతు ఇచ్చే విధంగా చూసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.