భారత్ లో 37వేలకు పైగా కొత్త కరోనా కేసులు, 369 మరణాలు, 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. మొన్న నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు నేడు మరోమారు పెరిగాయి. భారతదేశంలో ఈరోజు 37,875 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 21.3 శాతం ఎక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 3,30,96,718 కు చేరుకుంది.

నాలుగు లక్షలకు దిగువగా కరోనా యాక్టివ్ కేసులు
మొత్తం దేశంలో యాక్టివ్ కేసులు 3,91,256 గా ఉన్నాయి. భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1.18 శాతం ఉన్నాయి.యాక్టివ్ కేసుల సంఖ్య వరుసగా రెండవ రోజు 400,000 మార్కు కంటే తక్కువగా ఉంది. రికవరీ రేటు 97.48 శాతంగా నమోదయింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 39,114 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3.22 కోట్లకు చేరుకుంది. మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 32,264,051 గా ఉంది.దేశంలో ప్రస్తుతం 2.49 శాతం వీక్లీ పాజిటివిటీ రేటు నమోదు అవుతుంది. గత 75 రోజులుగా 3 శాతం మార్కు కంటే వీక్లీ పాజిటివిటీ రేటు తక్కువగా ఉంది.

నిన్న ఒక్కరోజు నమోదైన మరణాలు 369
గత ఏడు రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.16 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 369 మంది మరణించారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు వరకు మరణించిన వారి సంఖ్య 4,41,411 కు చేరుకుంది. జాతీయ స్థాయిలో మరణాలు 1.33 శాతంగా ఉన్నాయి., దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.75 కోట్ల డోసుల టీకాలు వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ యొక్క మూడవ తరంగం ఇప్పటికే ముంబై పై ఉన్నట్టు తాజా కేసుల పెరుగుదల సూచిస్తుంది. నగర మేయర్ కేసుల ఆకస్మిక పెరుగుదలను సూచిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. "కోవిడ్ -19 యొక్క మూడవ తరంగం దేశవ్యాప్తంగా రాకున్నా ముంబైలో ఉందని కిషోరి పెడ్నేకర్ అన్నారు.

కేరళలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
2020 లో, భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుండి ఆగష్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు మరియు సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది. గ సెప్టెంబర్ 28 న 60 లక్షలు, అక్టోబర్ 11 న 70 లక్షలు, అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు దాటి, డిసెంబర్ 19 న కోటి మార్కును అధిగమించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ కాలంలో గణనీయంగా కేసులు పెరిగి భారత్ కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 3.30 కోట్లు దాటింది. కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తూనే ఉంది . తాజాగా నమోదైన కేసులలో 25, 772 కేసులకు పైగా ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. కేరళ రాష్ట్రానికి నిపా వైరస్ మరొక ముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కేరళలో గత 24 గంటల్లో 189 మంది కరోనా మహమ్మారి కారణంగా బలయ్యారు.
Recommended Video

కేరళ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక రోజువారీ కేసులు నమోదు
కేరళ రాష్ట్రం తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదు చేస్తున్న, దేశంలోనే అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3,898 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 86 మంది మహమ్మారి కారణంగా మరణించారు. కేరళ, మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రంగా మూడవ స్థానంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 1544 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే తమిళనాడు రాష్ట్రంలో 19 మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు.












Click it and Unblock the Notifications