244 మందితో వేల అడుగుల ఎత్తులో విమానం- బాంబుతో పేల్చేస్తాం: ఎమర్జెన్సీ- ఉరుకులు పరుగులు
అహ్మదాబాద్: గుజరాత్ లోని జామ్ నగర్ విమానాశ్రయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మాస్కో నుంచి గోవాకు వస్తోన్న విమానానికి బాంబు బెదిరింపు అందింది. దీనితో అత్యవసరంగా ఈ విమానాన్ని జామ్ నగర్ లో ల్యాండింగ్ చేయించారు అధికారులు. విమానం ల్యాండ్ కావడానికి ముందే- అంబులెన్సులను విమానాశ్రయం వద్ద అందుబాటులో ఉంచారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ ఉదంతంతో ఎయిర్ పోర్ట్, దాని పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయలుదేరిందీ విమానం. ఆ సమయంలో విమానంలో 244 మంది ప్రయాణికులు ఉన్నారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన తరువాత అనూహ్యంగా బాంబు బెదిరింపు అందింది. ఈ విమానంలో బాంబు పెట్టామని, కొద్దిసేపట్లో అది పేలి పోతుందంటూ గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం అధికారులకు సమాచారం అందింది.

దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. గుజరాత్ గగనతలం మీదుగా పనాజీకి వస్తోన్న విమానాన్ని దారి మళ్లించారు. సమీపంలోనే ఉన్న జామ్ నగర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించారు. వారందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించారు. విమానాన్ని జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ లో గల ఐసొలేషన్ బే లో ఉంచారు. దీన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తోన్నారు గుజరాత్ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది.
గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సమాచారాన్ని అందిన వెంటనే జామ్ నగర్ విమానాశ్రయం అధికారులు స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను విమానాశ్రయం వద్ద మోహరింపజేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం అయ్యారు. అంబులెన్సులను ఎయిర్ పోర్ట్ వద్ద అందుబాటులో ఉంచారు. ఆసుపత్రులకూ సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బందినీ అప్రమత్తం చేశారు అధికారులు.

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. పోలీసు వాహనాలు, అంబులెన్సుల సైరన్ మోతలతో జామ్ నగర్ విమానాశ్రయం పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోయాయి. స్థానికులకు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం పరిసర ప్రాంతాలకు సామాన్య ప్రజలను ఎవరినీ రానివ్వలేదు.












Click it and Unblock the Notifications