ఈమె తల్లి కాదు: కళ్లు తెరవకముందే పసిబిడ్డను కాటికి పంపిన కసాయి తల్లి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల కనీసం కళ్లు తెరిచి లోకం చూడకముందే ఆ కర్కష తల్లి చిన్నారి బిడ్డ ముక్క మూసి ఊపిరాడకుండ చేసి హత్య చేసింది. వివరాల్లోకెళితే... రీటా దేవీ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఢిల్లీ మోతీనగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్లో చేరింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎంతో నొప్పులను భరించి జన్మనిచ్చిన అదే తల్లి అదే చేతులతో బిడ్డను చంపేసింది.
ఆడపిల్లలు తన భర్తకు ఇష్టం లేదని ఎప్పుడూ తమ మధ్య ఇదే అంశంపై గొడవ జరిగేదని రీతాదేవీ డెలివరీకి ముందు తన సహాయకురాలితే చెప్పేదట. ఇప్పటికే తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆమెతో అనేదట. అందుకే ఈ సారి ఆడపిల్ల వద్దు అని తరుచూ చెప్పేదట. అయితే ఈ చర్యను సైకియాట్రిస్టులు మరోలా చెబుతున్నారు. ప్రసవానంతరం నుంచి వచ్చిన నిరాశతోనే కొందరు తల్లులు ఇలా ప్రవర్తిస్తారని చెబుతున్నారు.
రీటాదేవి ఆదివారం ఉదయం 3:50 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో ఎలాంటి వింత మార్పు రాలేదని డాక్టర్లు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు వచ్చి తల్లి బిడ్డలను పరీక్షించగా ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. అయితే ఉదయం 9 గంటలకు తన బిడ్డ కదలడంలేదని రీటాదేవి వైద్యుల దృష్టికి తీసుకొచ్చింది. బిడ్డను బాగా పరిశీలించిన డాక్టర్లు చిన్నారి ముక్కు చుట్టూ నల్లని మరకలు ఉండటాన్ని గుర్తించారు. అవే మరకలు బిడ్డ పెదాల చుట్టూ కూడా కనిపించాయి. ఇది కచ్చితంగా హత్యే అని నిర్ధారణకు వచ్చారు డాక్టర్లు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు .
పోలీసుల విచారణలో తన భర్త మహతోకు ఆడపిల్లలు అంటే ఇష్టం లేదని చెప్పింది. అయితే పోలీసులు మహతోను విచారణ చేయగా ... తన బిడ్డ హత్యకు గురైందన్న విషయం తెలియదన్నాడు. అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉన్న తను... మిగతా పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఒక సహాయకురాలిని అక్కడ ఉంచి తన పిల్లల దగ్గరకు వచ్చినట్లు మహతో చెప్పాడు. పేదవాడైన తనకు ఆడపిల్ల అయితే ఏంటి... మగబిడ్డ అయితే ఏంటని పోలీసులకు చెప్పినట్లు వారు తెలిపారు. ఎట్టకేలకు ఆ చంటి బిడ్డను హత్యచేసింది తల్లి రీటాదేవినే అనే నిర్ధారణకు వచ్చి పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.