Video: అందాల ఎవరెస్ట్ అసహ్యకర రూపం.. అంతా విష వ్యర్థాలే!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన శిఖరంగా భావించే మౌంట్ ఎవరెస్ట్ ఇప్పుడు ఒక భయంకరమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హిమపాతాలు, మంచు అందాలతో మురిపించాల్సిన ఈ పర్వతం.. మానవ తప్పిదాల వల్ల క్రమంగా ఒక భారీ 'విష వ్యర్థాల కుప్ప'గా మారుతోంది. ముఖ్యంగా ఎవరెస్ట్ పైన ఉండే అత్యంత ప్రమాదకరమైన 'డెత్ జోన్' ఇప్పుడు టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తతో నిండిపోయి, దిగువన ఉండే లక్షలాది మంది ప్రజల తాగునీటి సరఫరాకే ముప్పుగా పరిణమించింది.
మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికి చివరి శిబిరమైన క్యాంప్-IV (సౌత్ కోల్) భూమిపైనే అత్యంత ఎత్తైన ప్రాంతం (సుమారు 7,900 మీటర్లు). ఇక్కడి వాతావరణాన్ని 'డెత్ జోన్' అంటారు. ఎందుకంటే ఇక్కడ గాలి చాలా పలచగా ఉండి, ఆక్సిజన్ అందక మానవ శరీరం క్షీణించడం ప్రారంభిస్తుంది. రష్యన్ పర్వతారోహకురాలు ఏంజెలోవా ఇటీవల తీసిన చిత్రాలు ఈ ప్రాంతంలోని భయానక పరిస్థితిని కళ్లకు కట్టాయి. అధికారులు అంచనా ప్రకారం, ఈ సౌత్ కోల్ ప్రాంతంలో ప్రస్తుతం 40 నుంచి 50 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. పాత ఆక్సిజన్ సిలిండర్లు, చిరిగిన టెంట్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లు, గడ్డకట్టిన మానవ వ్యర్థాలతో ఈ మృత్యు ప్రాంతం నిండిపోయింది. ఇక్కడి అతి శీతల వాతావరణం వల్ల ఈ చెత్త కుళ్ళిపోకుండా అలాగే ఉండిపోతోంది.

రికార్డు స్థాయి రద్దీ.. ప్రాణమా? శుభ్రతా?
పర్వతారోహణ పూర్తిగా వాణిజ్యీకరణం కావడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం 2026 సీజన్లో రికార్డు స్థాయిలో 494 విదేశీ పర్వతారోహణ అనుమతులు జారీ చేసింది. ఈ ఏడాది దాదాపు 900 మంది శిఖరాన్ని చేరుకోగా.. కేవలం మే 20న ఒకే ఒక్క రోజు ఏకంగా 274 మంది విజయవంతంగా ఎవరెస్ట్ను అధిరోహించారు. ఈ విపరీతమైన రద్దీ కారణంగా పర్వతంపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఎముకలు కొరికే చలి, ఆకస్మిక తుఫానుల సమయంలో పర్వతారోహకులకు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అవుతుంది కానీ, శుభ్రత కాదు. అందువల్ల విపత్కర పరిస్థితుల్లో అలసిపోయిన అధిరోహకులు తమకున్న భారీ సామాగ్రిని, టెంట్లను అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు.
నిబంధనలు ఉన్నా బేఖాతరు.. దిగువన ప్రజలకు ముప్పు!
సాధారణంగా ప్రతి అధిరోహకుడు సగటున 8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాడు. దిగువ క్యాంపుల్లో చెత్తను తీసుకొస్తే డిపాజిట్ డబ్బులు తిరిగి వస్తుండటంతో అక్కడ కొంతవరకు చెత్త సేకరిస్తున్నారు. కానీ, అత్యంత ప్రమాదకరమైన ఎత్తైన ప్రాంతాల్లో ప్రాణాలకే గ్యారెంటీ లేకపోవడంతో అక్కడ చెత్త సేకరణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. "ఎంతో అద్భుత ప్రదేశంగా ఉండాల్సిన ఎవరెస్ట్, వాణిజ్యీకరణకు అత్యంత అసహ్యకర ముఖాలలో ఒకటిగా మారింది" అని 'ఎవరెస్ట్ టుడే' ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వ్యర్థాల సంక్షోభం కేవలం పర్వతానికే పరిమితం కాలేదు. గ్లోబల్ వార్మింగ్ (వాతావరణ మార్పుల) వల్ల హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల దశాబ్దాల నాటి రసాయన, మానవ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ విష కాలుష్యం అంతా కొండలపై నుంచి కిందికి ప్రవహించే మంచినీటి ప్రవాహాలలో కలుస్తోంది.
This is Camp IV on Mt Everest (~7,900 m), the highest campsite on Earth and the final stop before the summit.
— Everest Today (@EverestToday) June 1, 2026
What should be one of the most extraordinary places on the planet has, in many ways, become one of the ugliest faces of Everest's commercialisation. Abandoned tents,… pic.twitter.com/0Th04sCa5J
పర్వతాల దిగువన నివసిస్తూ, ఈ నీటిపైనే ఆధారపడే లక్షలాది అమాయక కుటుంబాలకు ఇది పెద్ద ఆరోగ్య విపత్తుగా మారబోతోంది. ఈ సంక్షోభాన్ని అరికట్టేందుకు నేపాల్ ప్రభుత్వం 2025-2029 కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రేంజర్ల నియామకం, అదనపు రుసుములు, జీవవిచ్ఛిన్నమయ్యే (Biodegradable) ప్యాకేజింగ్ను తప్పనిసరి చేశారు. మరి ఈ చర్యలైనా ఎవరెస్ట్ పవిత్రతను కాపాడుతాయో లేదో చూడాలి.














Click it and Unblock the Notifications