‘తాలిబన్ సంస్కృతి’!మొహర్రం ఊరేగింపులో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు
భోపాల్: మొహర్రం వేడుకల్లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో చోటు చేసుకుంది. మొహర్రం వేడుకల్లో పాకిస్థాన్ నినాదాలు చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
కరోనా నిబంధనలను, మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఉజ్జయినీలోని గీతా కాలనీ వద్ద మొహర్రం ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ర్యాలీలో పాల్గొన్న కొందరు నినాదాలు చేశారు. గురువారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జాఫర్, అనీస్, అబ్దుల్, అజీజ్ తోపాటు పలువురు పాకిస్థాన్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియోలను పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Watch young Muslims raising pro-Pakistan slogans in Ujjain during the Muharram event. pic.twitter.com/Wrtxx4nKGR
— Newsum (@Newsumindia) August 21, 2021
ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) సతేంద్ర కుమార్ శుక్లా మాట్లాడుతూ.. వీడియో ఆధారంగా పది మందిని గుర్తించామని తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారందరినీ విచారిస్తున్నామన్నారు. మిగితా నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
త్వరలోనే నిందులందర్నీ పట్టుకుంటామని ఎస్పీ సతేంద్ర కుమార్ తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులంతా 20-25 ఏళ్ల వయస్కులేనని చెప్పారు.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం.. ఎస్పీ అమరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్కు మద్దతుగా నినాదాలు చేసిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నిందితులపై 124ఏ, 153బీ, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.
పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. తాలిబన్ సంస్కృతిని ఈ దేశం సహించబోదని హెచ్చరించారు. దేశ భక్తులైన భారతీయులకే ఇక్కడ చోటుందని, తాలిబన్ మనస్తత్వానికి మద్దతు ఇచ్చేవారు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తేల్చి చెప్పారు.