ఊహించిందే జరిగింది: బీజేపీలో చేరిన ముకుల్ రాయ్..
అందరూ అనుకున్నట్లుగానే తృణమూల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు ముకుల్ రాయ్, భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.
ఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగానే తృణమూల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు ముకుల్ రాయ్, భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ముకుల్ రాయ్ను ఆయన బీజేపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 'ఇవాళ ప్రముఖ రాజకీయ నాయకుడు ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు..ఆయన అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం..' అని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కుడిభుజంగా వ్యవహరించే ముకుల్రాయ్ సెప్టెంబర్ 25న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,అక్టోబర్ 11న తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.
ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో సీఎం మమతాబెనర్జీ విఫలమైన కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ముకుల్ రాయ్ చెప్పారు. అయితే టీఎంసీ అధిష్ఠానం మాత్రం ముకుల్రాయ్ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్న ముకుల్ రాయ్ అందరూ ఊహించినట్లుగానే శుక్రవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'బీజేపీలో చేరాను. అందుకు చాలా గర్వంగా ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను..' అన్నారు.