ప్రధాని రేసులో లేను..! ఐనా ఎన్నికల తర్వాత స్పష్టత వస్తుందన్న ములాయం..!
లక్నో/హైదరాబాద్ : బీజేపికి వ్యతిరేకంగా విపక్షాలు దేశ వ్యప్తంగా చురుకైన పాత్ర పోషిస్తూ ఎన్నికల సమరంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో ఎస్పీ నేత ములాయం పింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రి రేసులో తాను లేనని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. నేడు మెయిన్ పురి లోక్ సభ స్థానానికి తన కొడుకు అఖిలేష్ తో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి తరఫున ఎవరు ప్రధాని అభ్యర్థి అని అడిగినప్పుడు ఎన్నికల తర్వాతే ఎవరనేది నిర్ణయిస్తారు అంటూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా తాను ప్రధాని రేసులో లేనని కూడా స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో తన తండ్రి ములాయం గెలుస్తారని అఖిలేష్ స్పష్టం చేశారు.
రెండేళ్ల క్రితం పార్టీని అఖిలేష్ తన గుప్పిట్లోకి తీసుకోవడంతో ఆయనకు, ములాయం సింగ్కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గత నెలలో కూడా లోక్సభ అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపై అఖిలేష్ను ఆయన విమర్శించారు. అంతేకాకుండా మెయిన్పురిలో కాంగ్రెస్తోపాటు ములాయం సోదరుడు శివ్పాల్ యాదవ్కు చెందిన ప్రగతిషీల్ సమాజ్వాదీ పార్టీ-లోహియా కూడా తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదు.
మెయిన్పురి స్థానం నుంచే ములాయం 1996, 2004, 2009, 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లో అజాంగఢ్, మెయిన్పురి నియోజవర్గాల్లో పోటీ చేసి రెండింట్లోనూ ములాయం గెలిచారు. ఐతే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన సీట్ల మెజారిటీ ఆధారంగా ప్రధాని ఎవరనే అంశంపై స్పష్టత వస్తుందని ములాయం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కొసమెరుపు.