టీని వ్యతిరేకిస్తాం: బాబు భేటీ తర్వాత ములాయం
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును తాము పార్లమెంటులో వ్యతిరేకిస్తామని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సమావేశం తర్వాత ఆయన మంగళవారం ఆ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తాము కోరుకోవడం లేదని, చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని ఆయన అన్నారు.
కాగా, రాష్ట్ర విభజనపై వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్న చంద్రబాబు బుధవారం మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లనున్నారు. ముంబైలో ఆయన శివసేన నాయకులను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన శివసేన మద్దతు కోరే అవకాశం ఉంది.
చంద్రబాబు బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీతో కూడా సమావేశమయ్యారు. అద్వానీతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఎం ఓ వైపు దీక్ష చేస్తుంటే మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు ఆందోళన చేస్తారని, ఇదెక్కడి వైఖరని ప్రశ్నించారు.
సొంత పార్టీ నేతలకు కూడా కాంగ్రెసు పార్టీ సమాధానం చెప్పుకోలేకపోతోందన్నారు. రెండు ప్రాంతాల్లో సమన్యాయం జరగాలని తాము చెబుతున్నామని, ఇరు ప్రాంత నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని గతంలోనే చెప్పామన్నారు. కాంగ్రెసు అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెసు ఎదురు చూస్తోందని ధ్వజమెత్తారు.