Maharastra Civic Polls: తాడోపేడో తేల్చుకుంటున్న మహారాష్ట-ప్రతీ సీటూ కీలకం..!
మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఏకపక్షంగా గెల్చుకున్న మహాయుతి కూటమి ఏడాదిలోనే చీలికలు పీలికలుగా మారిన వేళ రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ తమ చీలిక వర్గాలతో కలిసిపోయి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో ఈ పోరులో గెలుపోటములు చాలా కీలకంగా మారిపోయాయి.
ఇవాళ మహారాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో మొత్తం 3.48 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరు 15,931 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. ఇవాళ ఉదయం మొదలైన ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 11.30 గంటల కల్లా కేవలం 20 శాతం లోపు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు దేశంలోనే అత్యంత ధనిక స్ధానిక సంస్ధ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికలు తీవ్ర ఉత్కంఠభరితంగా మారాయి. రూ.74,400 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన ఈ కార్పోరేషన్ పై పట్టు సాధించడమంటే ముంబైపై పట్టు సాధించినట్లే. నాలుగేళ్ల ఆలస్యం తర్వాత ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో 227 స్థానాలకు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ముంబైలో 20 సంవత్సరాల తర్వాత తమ సత్తా చాటుకునేందుకు తిరిగి కలిసిన థాకరే సోదరులకూ, బిజెపి-శివసేన కూటమి మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో థాక్రే సోదరులు గెలిస్తే తిరిగి ముంబైపై పట్టు సాధించడంతో పాటు మహారాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు బహుళ సభ్యుల వార్డు వ్యవస్థలో ప్రతి మున్సిపల్ వార్డు ఒకరికి బదులుగా ముగ్గురు లేదా నలుగురు కార్పొరేటర్లను ఎన్నుకుంటుంది. ఉదాహరణకు పూణే మున్సిపల్ కార్పొరేషన్లో 41 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు నలుగురు కార్పొరేటర్లను ఎన్నుకుంటుంది, జనరల్ బాడీలో 162 మంది సభ్యులు ఉంటారు. కాబట్టి ప్రతి ఓటరు బహుళ ఓట్లు వేస్తాడు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.












Click it and Unblock the Notifications