పరువుపైనే ప్రేమ-కూతురుపై లేదు: జ్యూస్లో విషమిచ్చి హత్య
మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో తల్లిదండ్రులే 22ఏళ్ల తమ కూతురుకు విషమిచ్చి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన యువతి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. గురుమల్లప్ప(64), మంజుల(48)లకు మధు కుమారి(22), గురుప్రసాద్ అనే ఇద్దరు సంతానం. కాగా, శివరాజు అనే వ్యక్తితో మధు కుమారికి ఆమె కుటుంబసభ్యులు ఏప్రిల్ 29న వివాహం నిశ్చయించారు. అయితే ఈ పెళ్లి మధు కుమారికి ఇష్టం లేదు.
ఈ క్రమంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులు, సోదరుడికి తేల్చి చెప్పింది మధు కుమారి. గురుప్రసాద్ స్నేహితుడైన జయరాం అనే యువకుడితో మధు కుమారి ప్రేమాయణం సాగిస్తోందనే విషయం ఆమె కుటుంసభ్యులకు తెలిసింది.
అదే గ్రామానికి చెందిన జయరాంది వేరే కులం కావడంతో మధు కుమారి కుటుంబసభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మధు కుమారితో పురుగుల మందు కలిపిన మామిడి రసాన్ని తాగించారు కుటుంబసభ్యులు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కాగా, అంతకంటే ముందే.. తనకు వేరే వివాహం చేస్తున్నారని మధు కుమారి తన ప్రియుడు జయరాంకు లేఖ రాసింది. ఈ పెళ్లికి అంగీకరించకపోతే తనను గానీ, జయరాంను గానీ చంపుతామని కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొంది.
మధు కుమారిని హత్య చేసిన ఆమె తల్లిదండ్రులు, సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమ నేరాన్ని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించిన వాడు వేరే కులం వ్యక్తి కావడంతోనే పరువు కోసం కన్న కూతుర్ను చంపుకున్నారని పోలీసులు చెప్పారు.