కుంభమేళాపై మోదీ కీలక వ్యాఖ్యలు... ఇక ప్రతీకాత్మకంగానే జరపాలని విజ్ఞప్తి... గడువుకు ముందే ముగిస్తారా?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక కుంభమేళా కేవలం ప్రతీకాత్మకంగానే జరగాలని... తద్వారా కోవిడ్ 19పై పోరాటాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కుంభమేళాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక భక్తులెవరూ ప్రత్యక్షంగా అందులో పాల్గొనవద్దని... కేవలం లాంఛనప్రాయ కార్యక్రమంగా దాన్ని నిర్వహించాలని ప్రధాని మోదీ పరోక్షంగా సూచించారు.
మోదీ ఏమన్నారంటే...
కుంభమేళా గురించి నిరంజనీ అకారా అధ్యక్షుడు స్వామి అవధేశానంద గిరి మహారాజ్తో ఫోన్లో మాట్లాడినట్లు మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యం గురించి ఆరా తీశానని... వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. సాధువులంతా ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. కుంభమేళాలో ఇప్పటికే రెండు షాహీ స్నాన్(రాజ స్నానాలు) పూర్తయ్యాయి గనుక ఇక దాన్ని ప్రతీకాత్మకంగా జరపాలని... ఆ క్రతువును త్వరగా ముగించాలి అన్నట్లుగా మోదీ పేర్కొన్నారు. కోవిడ్ 19పై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఇది అవసరమన్నారు.
మోదీ ట్వీట్పై అవధేశానంద స్పదన...
ప్రధాని మోదీ ట్వీట్పై స్వామి అవధేశానంద స్పందించారు. 'ప్రధాని మోదీ విజ్ఞప్తిని మేం గౌరవిస్తాం. ప్రాణాలు కూడా ముఖ్యమే. కాబట్టి పవిత్ర స్నానాల కోసం భక్తులు,సాధువులు పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని విజ్ఞప్తి. కోవిడ్ నియమాలను విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను..' అని ట్వీట్ చేశారు. కుంభమేళాలో ఇప్పటికే ఎంతోమంది అఖాడా సాధువులు,భక్తులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ సమాచారమేదీ లేదు : హరిద్వార్ మెజిస్ట్రేట్
కరోనా నేపథ్యంలో కుంభమేళాను త్వరగా ముగించేందుకు అఖాడాలు ముందుకొచ్చినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే అధికారులు మాత్రం అఖాడాలు ఇప్పటివరకూ తమతో అలాంటి చర్చలేవీ జరపలేదన్నారు. కాబట్టి షెడ్యూల్ ప్రకారమే కుంభమేళా కొనసాగుతుందని చెప్పారు. కుంభమేళాను కుదించాలన్న సమాచారమేదీ తమకైతే లేదని హరిద్వార్ మెజిస్ట్రేట్ దీపక్ రావత్ వెల్లడించారు. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని.. కుంభమేళాను కుదించేందుకు చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది.సాధారణంగా కుంభమేళా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. జనవరి మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకూ కొనసాగుతుంది. కానీ ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం ఏప్రిల్ నెలకే దీన్ని పరిమితం చేశారు.
Recommended Video