విశ్వగురు: ‘దేశానికి దేవుడిచ్చిన కానుక ప్రధాని మోడీ’
బృందావన్: మన దేశానికి దేవుడిచ్చిన కానుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. మోడీ ప్రపంచ ప్రఖ్యాత నేత అని.. సంపన్న, శక్తిమంతమైన భారత్గా తీర్చిదిద్దడానికి తీవ్రంగా కృషిచేస్తున్నాయని అన్నారు.
2022 నాటికి దేశాన్ని 'విశ్వగురు'గా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన భారతీయ జనతా యువమోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతిపతి మహాత్మ గాంధీ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ జేఎన్యూ వ్యవహారంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుకు సిగ్గుపడాలన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పేదల రక్తాన్ని పీల్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వారి గురించి మాట్లాడే హక్కులేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని అన్నారు. బిజెపి పేదల పార్టీ అని చెప్పారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, 10శాతానికిపైగా వృద్ధి రేటును నమోదు చేస్తోందని చెప్పారు. నాలుగేళ్ల నుంచి 20శాతానికిపైగా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆదాయ అసమానతలను తొలగిస్తున్నామని చెప్పారు.