భారత్లో కరోనా తగ్గుముఖం పడుతోందంటూ నాసా పేరుతో వార్తలు..ఇందులో నిజమెంత..?
సాధారణంగా ప్రతి సంవత్సరం దీపావళికి ముందు ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది. దివాళీ వేడుకలతో భారత్లో కాలుష్యం ఏమేరకు పెరిగిపోతుందనేది ఈ మెసేజ్ సారాంశం. అయితే ఇది నాసా పేరుమీద సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి అలాంటి మెసేజ్ను ఈ అగ్రసంస్థ ఎప్పటికీ సర్క్యులేట్ చేయదు. తాజాగా ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫేక్ మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కూడా ఏదో నాసా చెప్పినట్లుగా ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.
నాసా పేరుతో ఫేక్ మెసేజ్
కరోనావైరస్ విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను రిస్క్ చేసి సేవలందిస్తున్న మెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా సిబ్బందికి చప్పట్లతో అభినందనలు తెలపాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపును అందుకున్న ప్రజలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు గంటలు మోగించి చప్పట్లతో తమ ధన్యవాదాలను తెలిపారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఒక ఫేక్ వాట్సాప్ మెసేజ్ ప్రజల మొబైల్స్ కు వచ్చింది. దీపావళి ముందు ఒక శాటిలైట్ చిత్రం కలిగి ఉన్న మెసేజ్ నాసా పేరుతో ఎలా అయితే వైరల్ అవుతుందో కరోనావైరస్ నేపథ్యంలో కూడా అదే నాసా పేరు మీద మరో ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది.
ఫేక్ మెసేజ్ సారాంశం
నాసా పేరుతో వైరల్ అయిన ఫేక్ మెసేజ్ సారాంశం ఇలా ఉంది." ప్రధాని నరేంద్ర మోడీ 22 మార్చి ఆదివారం దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపును నాసా శాటిలైల్ వీడియో ద్వారా లైవ్ టెలికాస్ట్ చేసింది. భారత్లో కరోనావైరస్ తగ్గుముఖం పట్టింది" అనే మెసేజ్ వైరల్ అయ్యింది. అంతేకాదు జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు చేసిన చప్పట్ల శబ్దంకానీ గంటలు మోగించిన శబ్దంను నాసాకు చెందిన ఎస్డీ 13 వేవ్ డిటెక్టర్ డిటెక్ట్ చేసిందని ఈమధ్యే తయారు చేసిన బయో శాటిలైట్ భారత్లో కోవిడ్ - 19 క్రమంగా అంతరించిపోతోందన్న సంకేతాలు ఇచ్చిందని ఆ మెసేజ్లో ఉంది. నాసా పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజ్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు చెప్పారు. ఈ మెసేజ్ వైరల్ అవగానే దీన్నే ట్విటర్పై ప్రజలు షేర్ చేయడం ప్రారంభించారు.
నాసానే స్వయంగా వెల్లడించిందంటూ ట్వీట్
ఇక వాట్సాప్లో నాసా పేరుతో వచ్చిన ఈ మెసేజ్ ఫేక్ అని కొందరు ఖండిస్తుండగా.. మరికొందరు మాత్రం కరోనావైరస్పై భారత్ విజయం సాధించిందంటూ స్వయంగా ఈ విషయాన్ని నాసానే వెల్లడించిందని వాట్సాప్ మెసేజ్ను ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు స్పేస్ స్టేషన్లో ఉన్న నాసా శాస్త్రవేత్తలకు భారత్ నుంచి చప్పట్ల శబ్దం వినపడిందంటూ మరొకరు ట్వీట్ చేశారు.
వివరణ ఇలా ఉంది
అయితే వైరల్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని వివరణ ఇచ్చింది నాసా. భూమిపై నిశబ్దత నెలకొన్న సమయంలో శబ్దంను నాసా రికార్డ్ చేయలేదని వివరణ ఇచ్చింది. సాంకేతికంగా లేదా శాస్త్రీయంగా ఇది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇక నాసా భూమి నుంచి వెలువడుతున్న శబ్దాలను రికార్డు చేయగలదని అయితే చప్పట్ల శబ్దం భూమిపై జరిగే ఇతరత్ర శబ్దాలను రికార్డు చేయదని స్పష్టం చేసింది. అంతేకాదు ఎస్డీ 13 వేవ్ డిటెక్టర్ అనే సాధనం లేదని చెప్పింది. కేవలం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రం మాత్రమే నాసా వినియోగిస్తుందని అది నిన్న భారత్లో చప్పట్ల కార్యక్రమంకు వినియోగించలేదని క్లారిటీ ఇచ్చింది.