మీడియా ధోరణులపై రెండు రోజుల జాతీయ సదస్సు
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్లోని ఆచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ మాస్ కమ్యూనికేషన్ విభాగం జనవరి 30, 31 తేదీల్లో మీడియా, పబ్లిక్ సర్వీస్ కమ్యూనికేషన్ వ్యాపారీకరణపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ జాతీయ సదస్సును సీనియర్ ప్రొఫెసర్ హెచ్.ఎస్ ఈశ్వరప్ప ప్రారంభించారు. ప్రారంభ సమావేశానికి డిడి రిటైర్డ్ అదనపు జనరల్ డైరెక్టర్ ఎన్.జి. శ్రీనివాస ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి జిఎంజె ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు బిఎం రెడ్డి అధ్యక్షత వహించారు.
మొదటి సెషన్ రేడియోపై జరిగింది. ఈ సెషన్కు ఆకాశవాణి రిటైర్డ్ అదనపు జనరల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఆర్. కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఐదుగురు ప్రముఖ బ్రాడ్కాస్టర్స్, అకడమిషియన్లు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. దానికి తోడు, రేడియోకు సంబంధించి నాలుగు పత్రాలను సమర్పించారు. నీరసంగా కనిపిస్తున్న ప్రభుత్వ సమాచార మాధ్యమం భవిష్యత్తుపై, పెరుగుతున్న రేడియో ఎఫ్ఎం డబ్ల్యుపై ఈ పత్రాలు దృష్టిని కేంద్రీకరించాయి. భవిష్యత్తు ప్రత్యామ్నాయం డిజిటల్ రేడియోనే అని నరసింహ స్వామి అభిప్రాయపడ్డారు.
టెలివిజన్పై జరిగిన రెండో సెషన్కు ఎన్జి శ్రీనివాస అధ్యక్షత వహించారు. మీడియాకు, విద్యారంగానికి చెందిన నలుగురు ప్రత్యేక వక్తలు ప్రసంగాలు చేశారు. టెలివిజన్కు సంబంధించిన 12 పత్రాల సమర్పణ జరిగింది. రియాలిటీ షో, టెలీ సీరియల ప్రతికూల పోకడలపై ఈ సెషన్ దృష్టి కేంద్రీకరిస్తూ ప్రేక్షకులు కార్యక్రమాలను ఎన్నుకోవడంలో తెలివిగా వ్యవహరించాలని ఈ సెషన్ సూచించింది. టిఆర్పి రేటింగ్ ఈ మీడియాను ఎలా క్రేజీగా మారుస్తుందో కూడా సెషన్లో చర్చకు వచ్చింది.
రెండో రోజు ప్రింట్ మీడియాపై సెషన్తో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సెషన్కు హెచ్ఎస్ ఈశ్వరప్ప అధ్యక్షత వహించారు. ప్రజావాణి న్యూస్ ఎడిటర్ ఎఎస్ నారాయణ ప్రధాన వక్తగా హాజరయ్యారు. ప్రింట్ మీడియాపై ఏడు పత్రాల సమర్పణ జరిగింది. ప్రపంచీకరణ నుంచి సాంకేతిక పరిజ్ఝానం వరకు ప్రింట్ మీడియాపై చూపుతున్న ప్రభావంపై సెషన్లో పత్రాల సమర్పణ జరిగింది. వాటి ప్రభావం టీవిపై ఎలా ఉందో కూడా చర్చ జరిగింది. టీవీ న్యూస్ చానెల్స్ పత్రికా రంగంపై చూపుతున్న ప్రభావంపై కూడా దృష్టి సారించింది.
సినిమా, నూతన మీడియాపై జరిగిన సెషన్కు బెంగళూర్ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగం చైర్మన్ డాక్టర్ బికె రవి అధ్యక్షత వహించారు. రెండు తరాలకు చెందిన ఇద్దరు ప్రముఖ చలన చిత్ర దర్శకులు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. చిత్ర నిర్మాణ వ్యాపారీకరణ అనివార్యతపై ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు మాట్లాడారు. ప్రేక్షకులు ఇష్టపడేది, డిమాండ్ చేసేది మాత్రమే సినిమాకు ప్రధానమవుతుందని ఆయన అన్నారు. చిత్ర నిర్మాణంలో పెరుగుతున్న టెక్నాలజీ పాత్రను కూడా వివరించారు.
తన సింపల్లగి ఒండు లవ్ స్టోరీ సినిమాను ఉదహరిస్తూ మీడియా మార్కెట్ అద్భుతమైన ప్రత్యామ్నాయ ప్రచారంగా ఎలా మారిందో వివరించారు. ఈ సెషన్లో పది పత్రాల సమర్పణ జరిగింది. ఈ సెషన్లో నూతన మీడియాపై కూడా చర్చ సాగింది. చివరి సెషన్లోజానపదం, థియేటర్పై ప్రసంగాలు సాగాయి. ఈ సెషన్కు ప్రొఫెసర్ మహేష్ చంద్ర గురు అధ్యక్షత వహించారు. జానపద నిపుణుడు డాక్టర్ బనందర్ కెంపయ్య ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఆచార్య ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ చెన్నవీరయ్య ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సెషన్లో 8 పత్రాల సమర్పణ జరిగింది.
కర్ణాటక జానపద అకాడమీ మాజీ చైర్మన్, జానపద నిపుణుడు డాక్టర్ బనందూర్ కెంపయ్య ముగింపు ఉపన్యాసంతో సదస్సు ముగిసింది.