లాలూ నేరగాడే, శశికళ.. మా ఇష్టం: ఎంపీ షాకింగ్ కామెంట్స్
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు, ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్కు లంకె పెట్టారు అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్. ఆయన చిన్నమ్మ మద్దతుదారుడు. రాజ్యసభ సభ్యుడు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు, ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్కు లంకె పెట్టారు అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్. ఆయన చిన్నమ్మ మద్దతుదారుడు. రాజ్యసభ సభ్యుడు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను నేరస్తురాలిగా సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఆమె పార్టీ పదవిలో కొనసాగకూడదనే డిమాండ్లపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. లాలూ నేరస్తుడు కాడా? ఆయన పార్టీ నేతగా లేడా? అని నిలదీశారు.
పన్నీరు సెల్వం అప్పుడెందుకు మాట్లాడలేదు
జయలలిత మరణం గురించి న్యాయవిచారణ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం నిరాహారదీక్ష ప్రకటించారని, జయలలిత మరణించిన తర్వాత 70 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వం ఆ సమయంలో దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
పదవీ కాంక్షతోనే..
పదవీకాంక్షతో రాజకీయం చేస్తున్నారన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఎన్నికల సంఘానికి పిటిషన్ ఇచ్చే అర్హత అసలు పన్నీర్ సెల్వానికి లేదని తెలిపారు.
నిబంధనలేమీ లేవు
పార్టీ నిబంధనల మేరకే చిన్నమ్మ ఎన్నిక జరిగిందని, అందువల్ల వారి పిటిషన్ను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోదని భావిస్తున్నట్లు చెప్పారు. శిక్ష పొందినవారు పార్టీ నేతగా, ప్రధాన కార్యదర్శిగా కొనసాగకూడదని ఎక్కడా లేదన్నారు.
పార్టీ అంతర్గత విషయం
ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు, ఎన్నికల కమిషన్కు లేదన్నారు. లాలూ పశుదాణా కేసులో శిక్ష పొందారని, అయినా ఆయన ఆర్జేడీ నేతగా ఉన్నారన్నారు.
పన్నీరుకు హెచ్చరిక
అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ కూడా కొనసాగుతున్నారని, ఇందులో ఎలాంటి తప్పులేదన్నారు. ప్రస్తుతం పన్నీర్సెల్వం నిరాహారదీక్ష చేస్తే అది కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.