పంజాబ్ను మళ్లీ పట్టాలెక్కిద్దాం.. జనం కాంగ్రెస్ను విశ్వసించారు: సిద్దూ
చండీఘడ్: పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం ఆ పార్టీకి కలిసొచ్చింది.
ఈ నేపథ్యంలో తాజా ఫలితాలపై నవజ్యోత్ సింగ్ సిద్దూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పంజాబ్ ఓటర్లు కాంగ్రెస్ ను విశ్వసించారని అభిప్రాయపడ్డ సిద్దూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ది అస్తిత్వ పోరాటం అని అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు కొత్త సంవత్సర కానుక అని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడంతో.. ఇక పంజాబ్ హక్కుల కోసం కేంద్రంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని సిద్దూ అన్నారు. దెబ్బ తిన్న పంజాబ్ను మళ్లీ పట్టాలెక్కిద్దామని పంజాబ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేజ్రీవాల్ ప్రచారంలో నిజాయితీ లేదన్నారు. అందుకే ఓటమి పాలయ్యారు. సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ప్రచారానికి పంజాబ్ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని తెలిపారు. దాదాపు 25 ఏళ్లు భారత్ తరపున క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచాను, ఇంకా ఏం కావాలి? ఇప్పుడు నాకు కావాల్సిందల్లా పంజాబ్ అభివృద్ధి మాత్రమేనని సిద్దూ స్పష్టం చేశారు.
దుష్టులను ఎప్పటికైనా భగవంతుడు శిక్షిస్తాడని, ఈ విజయాన్ని కట్టబెట్టి ప్రతీ కష్టంలోను వెన్నంటి ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని సిద్దూ వ్యాఖ్యానించారు. నిస్వార్థంతో పోటీ చేస్తే ఎన్నటికైనా తమదే విజయమన్నారు.