జేఎన్యూ ఘటన నాజీ దమనకాండను తలపిస్తోంది : కేరళ సీఎం విజయన్
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో జరిగిన హింసాకాండపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. క్యాంపస్లో జరిగిన దాడి నాజీల దమనకాండను తలపిస్తోందన్నారు. భయంకరమైన అసహన వైఖరికి ఇది నిదర్శనం అన్నారు. దేశంలో అశాంతిని,ఉన్మాదాన్ని సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.జరిగిన దాడి వారి ఉద్దేశాలను స్పష్టం చేస్తోందని,రక్తపాతంతో యూనివర్సిటీల గొంతు మూయించాలని చూస్తున్న సంఘ్ పరివార్ ఇకనైనా తన క్రూర చర్యలకు ముగింపు పలకాలని సీఎం విజయన్ సూచించారు. జేఎన్యూ విద్యార్థులు అందరి తరుపునా మాట్లాడుతున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
ఆదివారం సాయంత్రం జేఎన్యూలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ముసుగులు ధరించి,చేతుల్లో ఆయుధాలతో క్యాంపస్లోకి ప్రవేశించిన దాదాపు 50 మంది మూక.. విద్యార్థులు,టీచర్లపై దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో జేఎన్యూఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ తలకు తీవ్ర గాయమైంది. మరో 20 మంది గాయపడ్డారు. వీరందరిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఢిల్లీ లెఫినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జేఎన్యూ ప్రతినిధులను పిలిచి ఘటనపై మాట్లాడాలని సూచించారు.

కాగా,జరిగిన దాడిపై ఏబీవీపీ,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దాడి సందర్భంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
దాడి తర్వాత జేఎన్యూ గేట్ వద్ద వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేసినా.. పోలీసులు చూసీ చూడనట్టే ఉన్నారని ఆరోపిస్తున్నారు. జేఎన్యూ చరిత్రలో ఇలాంటి దాడి మునుపెన్నడూ జరగలేదని అక్కడి టీచర్లు చెబుతున్నారు. మరోవైపు జేఎన్యూ ఘటనను దేశంలోని మిగతా యూనివర్సిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జామియా యూనివర్సిటీ,అలీగఢ్ యూనివర్సిటీ,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడి విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
జేఎన్యూ హింసాకాండపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తగా.. ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదైనట్టు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలు,స్క్రీన్ షాట్స్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తం వ్యవహారంలో పోలీసుల పాత్రను కూడా తేలుస్తామని అంటున్నారు.












Click it and Unblock the Notifications