రోహిత్ తివారీ ఊపిరాడకే చనిపోయారు : హత్య కేసుగా నమోదు, ఫ్యామిలీ మెంబర్స్పై అనుమానం ?
న్యూఢిల్లీ : దివంగత కాంగ్రెస్ నేత, యూపీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ ఊపిరాడక చనిపోయినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆయనది సాధారణ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టుతో పోలీసులు రోహిత్ మృతి హత్య కేసుగా నమోదు చేశారు. అలాగే ఈ కేసు విచారణను క్రైం బ్రాంచ్కు బదిలీ చేశారు.
సస్పెక్ట్ డెత్ ?
రోహిత్ మృతిపై తొలి నుంచి అనుమానాలు ఉన్నాయి. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయలేదు. అంతేకాదు రోహిత్ మృతిపై ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ప్రోద్బలంతో హత్య జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల 16న రోహిత్ మృతిచెందాడు. ఆ సమయంలో అతని భార్య, పెద్ద అన్న మాత్రమే ఇంట్లో ఉన్నారు. రోహిత్ తల్లి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రోహిత్ మృతికి గల కారణాలు తెలియాలంటే భార్య, అన్నను విచారించాల్సిన అవసరం ఉంది.
సాధారణ మరణమే .. కానీ ?
రోహిత్ చనిపోయాక అతనిని సాధారణ మరణమేనని అతని తల్లి ఉజ్వల పేర్కొన్నారు. తనకు ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని స్పష్టంచేశారు. కానీ రోహిత్ మరణానికి గల కారణాలేంటో తర్వాత చెప్తానని వివరించారు. దీంతో కుటుంబ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల రోహిత్ చనిపోయాడా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి పోస్టుమార్టం నివేదిక తోడవడంతో ఆ సందేహాలు నిజమేనా అనే అనుమానం కలుగుతోంది.
పోరాట బాట
రోహిత్ తన తండ్రి ఎన్డీ తివారీనని పోరాటమే చేశారు. తల్లి ఉజ్వలతో కలిసి కోర్టు మెట్లెక్కారు. వివిధ విచారణ క్రమంలో డీఎన్ఏ టెస్ట్ ద్వారా రోహిత్ ఎన్డీ తివారీ కుమారుడేనని తేలింది. తర్వాత తివారీ కూడా రోహిత్ తన కుమారుడిగా అంగీకరించారు. తర్వాత వయసు పైబడి ఎన్డీ తివారీ చనిపోగా ... చిన్న వయస్సులోనే రోహిత్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అనుకున్నట్టుగానే రోహిత్ది సాధారణ మరణం కాదని .. పోస్టుమార్టం నివేదికతో తేలింది.