2019లోను: బాబు, మోడీ ప్రత్యేకంగా.., హాజరైన పవన్
న్యూఢిల్లీ: ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రారంభమైంది. ఎన్డీయేలో 29 పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీల తరఫున హాజరైన ముఖ్య నేతలను బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ పరిచయం చేశారు.
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో ఎన్డీయేలోని 29 పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఉద్దవ్ థాకరే, రామ్ విలాస్ పాశ్వాన్, శ్రీమతి అనుప్రియా పటేల్, వీరేంద్ర కుశ్వాన్, కుల్దీప్ భిష్ణోయ్, విజయకాంత్, అంబుమణి రామదాస్ తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు వెంట టిడిపి ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమిలో ఇన్ని పార్టీలు చేరడం సంతోషకరమని అద్వానీ అన్నారు.
ఎన్డీయే కూటమి నేతలు పలువురు మాట్లాడిన అనంతరం మోడీ ప్రసంగించారు. ఎన్డీయే కూటమికి చాలామంది నేతలు కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. తనకు మీ ఆశీర్వాదం కావాలని ఎన్డీయే కూటమిని ఉద్దేశించి అన్నారు. చంద్రబాబుకు మోడీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సీమాంధ్రలో విజయానికి చంద్రబాబు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు.
ప్రకాశ్ సింగ్ బాదల్
ఈ ఎన్నికలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని ప్రకాశ్ సింగ్ బాదల్ చెప్పారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే మోడీదీ గొప్ప విజయమన్నారు.
ఉద్దవ్ థాకరే
మోడీ ఒక కలను నిజం చేశారని ఉద్దవ్ థాకరే అన్నారు. మహారాష్ట్ర, శివసేన ఎప్పుడు బిజెపి వెంట ఉంటుందని చెప్పారు. 25 ఏళ్లుగా బిజెపితో మిత్రపక్షంగా ఉన్నామని చెప్పారు. ప్రసంగం ముగింపులో జై హింద్, జై మాహారాష్ట్ర అన్నారు.
చంద్రబాబు
ఎన్డీయే గెలుపు సంతోషం కలిగించిందని చంద్రబాబు అన్నారు. మోడీ ప్రమాణ స్వీకారం కోసం దేశమంతా ఎదురు చూస్తోందన్నారు. ఈ విజయం ప్రతి సామాన్యుడు పండుగలా చేసుకుంటున్నారన్నారు. ఎపిలో ప్రచారం కోసం వచ్చినప్పుడు ఏకధాటిగా ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారని, వర్షంలోను ర్యాలీలో పాల్గొన్నారని మోడీకి చంద్రబాబు కితాబిచ్చారు.
అకుంఠిత దీక్షతో విజయానికి కృషి చేసిన మోడీకి అభినందనలు అన్నారు. దేశ అభివృద్ధి కోసం మోడీకి టిడిపి అండగా ఉంటుందన్నారు. 2019లో కూడా మోడీయే ప్రధాని అవుతారని చెప్పారు. మోడీ ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ను అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నానని చెప్పారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడుతుందన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్
ఎవరికి పదవులు అనేది అప్రస్తుతమని రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. దేశ సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి నమూనాకే పట్టం కట్టారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమకు ముఖ్యమని చెప్పారు.