కనీవినీ ఎరుగని రీతిలో అతిధులకు భద్రత - అందరి చూపు ఢిల్లీ వైపే..!!
ఇప్పుడు ప్రపంచ చూపు భారత్ వైపే. ప్రపంచ స్థాయి సదస్సుకు ఢిల్లీ వేదిక అవుతోంది. జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ చారిత్రక ఘట్టం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరి కోసం కనివినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆధునిక సాంకేత వినియోగిస్తూ భారీ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో జీ 20 సదస్సు : ఢిల్లీ కేంద్రంగా ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ-20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించటం..దేశ రాజధానిలో సదస్సు నిర్వహణ ద్వారా ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. జీ-20 సభ్య దేశాల అధినేతలు ఢిల్లీకి తరలి వస్తున్నారు. ఈ సదస్సు ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సమావేశాల కోసం 1,30,000 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ సేవలందించబోతున్నాయి.వీరిలో 80 వేల మంది ఢిల్లీ పోలీసులు కూడా ఉన్నారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా దళాలకు చెందిన 45 వేల మంది సిబ్బంది భారత దేశంలో పోలీసులు ధరించే ఖాకీ దుస్తులకు బదులుగా నీలి రంగు దుస్తులు ధరిస్తారు.
భారీ భద్రతా ఏర్పాట్లు : ఈ 45 వేల మందిలో కొందరు కమాండోలు కూడా ఉంటారు. ఈ కమాండోలు హెలికాప్టర్ల నుంచి తాడు ద్వారా క్రిందకు అత్యంత వేగంగా దిగగలిగే సామర్థ్యం ఉన్నవారు. కార్లను చాలా కచ్చితత్వంతో నడపగలిగే నైపుణ్యంగలవారు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా విధులకు కేటాయించారు. అతిథుల భద్రతకు భారీ ఏర్పాట్లలో భాగంగా వీరిని మొహరిస్తున్నారు. గగనతల రక్షణకు భారత వాయు సేన సమగ్ర చర్యలు చేపట్టింది.
గగనతలం గుండా ఎదురయ్యే ముప్పులను సమగ్రంగా తిప్పికొట్టేందుకు యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాల సహకారంతో భారత సైన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉంటారు. దేశాధినేతలను తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు రూ.18 కోట్లతో 20 బుల్లెట్-ప్రూఫ్ కార్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది.

తరలి వస్తున్న దేశాధినేతలు : ఈ సదస్సులో పాల్గొనే ముఖ్య నేతల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్, సౌదీ అరేబియా నేత మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టే అవకాశం ఉంది. అయితే జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీల నేతలు హాజరుకావచ్చు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్కు బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ హాజరవుతారు.
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల చీఫ్లు కూడా హాజరవుతారు. జీ20 సదస్సు జరిగే ప్రగతి మైదానంలో సెక్యూరిటీ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్లో బస చేస్తారు. ఆయనతోపాటు మిగిలిన దేశాల నేతలు బస చేసే హోటళ్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.












Click it and Unblock the Notifications