వణికిన ఢిల్లీ- వారంలో రోజుల్లో రెండోసారి..!!
ఖాట్మండూ: నేపాల్లో పెను భూకంపం సంభవించింది. అధిక తీవ్రతతో భూకంపం సంభవించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లోని న్యూ తెహ్రీ, పితోరాగఢ్, బాగేశ్వర్, పౌరీ వంటి ప్రాంతాల్లోనూ భూకంప తీవ్రత కనిపించింది.
నేపాల్-చైనా సరిహద్దుల్లోని సిలంగ టౌన్కు ఈశాన్య దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు పితోరాగఢ్ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణాధికారి బీఎస్ మహర్ చెప్పారు. ఈ పెను భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. సిలంగ టౌన్లో పలు నివాసాలు కుప్పకూలినట్లు సమాచారం అందిందని వివరించారు.

నేపాల్లో ఈ నెల 9వ తేదీన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని తీవ్రత 6.6గా నమోదైంది. కొన్ని గంటల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి ప్రకంపించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు సంభవించాయి. తొలి భూకంపం రాత్రి 9:07 నిమిషాలకు నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా రికార్డయింది. ఆ తరువాత 9.56 నిమిషాలకు మళ్లీ భూమి ప్రకంపించింది. దీని తీవ్రత 4.1. అలాగే అర్ధరాత్రి దాటిన తరువాత 2.12 నిమిషాలకు మరోసారి భూకంపం సంభవించింది.
Earthquake of Magnitude:5.4, Occurred on 12-11-2022, 19:57:06 IST, Lat: 29.28 & Long: 81.20, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/EeajzoWKi2 @OfficeOfDrJS @PMOIndia @DDNational @Ravi_MoES pic.twitter.com/QsUzaSduQv
— National Center for Seismology (@NCS_Earthquake) November 12, 2022
నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని దోటీ జిల్లాలోని పూర్బీ చౌకీ గ్రామం సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి పూర్బీ చౌకీ కౌన్సిల్ 3 ప్రాంతంలో ఆస్తినష్టం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పలు నివాసాలు కుప్పకూలాయని, ఈ ఘటనలో ఆరుమంది మరణించినట్లు పేర్కొన్నారు. సరిగ్గా నాలుగు రోజుల్లోనే మళ్లీ అదే స్థాయిలో భూమి ప్రకంపించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications