అసలేం జరిగింది: నేతాజీ రహస్య పత్రాలపై మోడీని కోరనున్న బోస్ మునిమనవడు
న్యూఢిల్లీ: దేశం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారనే విషయంలో రహస్య పత్రాలను ఇప్పటికైనా బహిర్గతం చేయాలని ఆయన వారసులు డిమాండ్ చేస్తున్నారు. వాటిని వెల్లడిస్తే ఇతర దేశాలతో సంబంధాలకు దెబ్బ తగుతుందంటూ యూపీఏ ప్రభుత్వం తప్పించుకుందనీ, నేతాజీ కుటుంబీకులపై అప్పటి ప్రధాన మంత్రి 20 ఏళ్ల పాటు నిఘా ఉంటారనే కథనాలు మీడియాలో రావడంతో పత్రాలను బయట పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం విదేశీ పర్యనటలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీని సోమవారం జర్మనీలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్లు నేతాజీ మునిమనవడు సూర్యకుమార్ బోస్ శనివారం తెలిపారు. అయితే సుబాష్ చంద్రబోస్పై నిఘాకు సంబంధించి వెలువడిన రహస్య పత్రాలతో ఇరుకున పడిపోయిన కాంగ్రెస్.. భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఈ పత్రాలను లీక్ చేసిందని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇక జర్మనీలోని మన రాయబార కార్యాలయం నిర్వహిస్తున్న ఈ సమావేశంలో నేతాజీ మేనల్లుడైన సూర్య బోస్ ప్రధాని మోడీని కలిసి నెహ్రూ ప్రభుత్వం పాల్పడిన నిఘాకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని పత్రాలను రహస్య జాబితానుంచి తొలగించి ప్రజల ముందు ఉంచవలసిందిగా డిమాండ్ చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
అంతేకాదు నిఘా జరిగి దశాబ్దాలు గడిచిపోయినందున ప్రభుత్వ నిబంధనలకు లోబడే కాలం చెల్లిపోయిన పత్రాల జాబితాలో వీటిని చేర్చి బహిరంగం చేయవలసిందిగా ఆయన కోరనున్నట్లు సమాచారం. జర్మనీలోనే ఉంటున్న నేతాజీ కుమార్తె అమితాబోస్ కూడా ప్రధానిని కలిసి నెహ్రూ ప్రభుత్వం తన తల్లిదండ్రుల మధ్య జరిగిన వ్యక్తిగత లేఖలను కూడా దొంగతనంగా సేకరించి రికార్డులలో పొందుపరచటాన్ని ఆయన దృష్టికి తీసుకువస్తారని తెలుస్తోంది.
అసలు విమాన ప్రమాదంలో బోసు చనిపోయారో లేదో ధ్రువీకరించకపోవడంతో ప్రధాని నెహ్రూ విపరీతమైన అభద్రతాభావంతో బోసు గురించి ఆరా తీయటానికే నిఘా పెట్టినట్లు సాక్ష్యాధారాలతో బయటపడింది. బోసు అన్న కుమారుడైన అనియాబోస్తో పాటు నేతాజీకి అత్యంత సన్నిహితుడైన శిశిర్ బోస్ కదలికలపై నిఘా పెట్టారు.
20 సంవత్సరాలుగా ఈ నిఘా కొనసాగినట్లు ధ్రువీకరించే పత్రాలను కేంద్ర హోం శాఖ కాలం చెల్లినవిగా పరిగణించి జాతీయ పురాతత్వ శాఖ భాండాగారంలో నిల్వ చేయటానికి పంపించింది. ఇప్పటికీ నేతాజీకి సంబంధించిన 80 ముఖ్యమైన ఫైళ్లు ప్రధానమంత్రి కార్యాలయం, హోమ్ శాఖ వద్ద ఉన్నాయని చెబుతున్నారు.
ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం చెల్లిపోయినందున అవసరం లేదన్న ఉద్దేశంతో సుమారు వెయ్యి ఫైళ్లను తగులపెట్టిన సంఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. దీంతో మహాత్మాగాంధీ హత్యకు సంబంధించిన ఫైళ్లు సహా అతి ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
బోసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను బయటపెట్టాలా? వద్దా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోగల అధికారం ఒక్క ప్రధానికే ఉంది. దీంతో బోస్ కుటుంబసభ్యులు ప్రధాని మోడీతో కానున్న సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. బెర్లిన్లో జరిగే కార్యక్రమానికి హాంబర్గ్లోని భారత్-జర్మన్ సంఘం అధ్యక్షుని హోదాలో హాజరు కావాల్సిందిగా బోస్ మునిమనవడు సూర్యకుమార్ బోస్కు ఆహ్వానం అందినట్లు వెల్లడించారు.