ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?
సహజ మరణాలకుతోడు ఈ ఏడాది కాలంలో కరోనా మహమ్మారి వల్ల అదనంగా 1.5లక్షల మంది బలైపోయారు. వైరస్ భయాలు తొలిగిపోకముందే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రబలడంతో 600మందికిపైగా అస్వస్థతకు గురై, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలదన్నట్లు తాజాగా దేశంలోకి మరో కొత్త రకం వ్యాధి ప్రవేశించింది. ఆఫ్రికా మీదుగా ఇండియాలోకి చేరిన ఆ పారాసైట్(పరాన్నజీవి) తాలూకు వివరాలు, అది ప్రాణాంతకమా, కాదా అనే వివరణలు ఇలా ఉన్నాయి..

మళ్లీ కేరళలోనే మొదలు..
ఎన్నారైల కోసం ప్రత్యేకంగా శాఖను కూడా నడుపుతోన్న కేరళకు విదేశాల నుంచి రాకపోకలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే దేశంలో తొలి కొవిడ్-19 కేసును కేరళలోనే గుర్తించడం విదితమే. చైనాలో కరోనా పుట్టినిల్లు వుహాన్ యూనివర్సిటీలో చదివే కేరళ విద్యార్థి స్వదేశానికి రావడంతో తొలి కేసు నమోదైంది. రెండేళ్ల కిందట (2018లో) నిఫా వైరస్ తొలి కేసు కూడా కేరళలోనే వెలుగుచూసింది. తాజాగా దేశంలోకి చొరబడ్డ అరుదైన పరాన్నజీవిని సైతం కేరళలోనే గుర్తించారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఆఫ్రికా నుంచి రాక..
తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తీవ్రమైన చెమట, దగ్గు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కలిగించే మలేరియా జన్యువును తొలిసారి గా మన దేశంలో గుర్తించారు. ప్లాస్మోడియం ఒవేల్ అనే పారాసైట్(పరాన్నజీవి)ని గుర్తించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి శైలజ ప్రకటించారు. ఈశాన్య ఆఫ్రికా దేశమైన సుడాన్ లో ఐక్యరాజ్యసమితి తరఫున విధులు నిర్వహించి ఇటీవలే తిరిగొచ్చిన ఆర్మీ జవాన్ ఒకరిలో దీనిని గుర్తించామన్నారు. ప్రస్తుతం ఆ జవాన్ కు కన్నూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్లాస్మోడియం ఒవేల్ ను మన దేశంలో గుర్తించడం ఇదే తొలిసారి అని మంత్రి పేర్కొన్నారు.

ఏమిటీ ప్లాస్మోడియం ఒవేల్?
మలేరియా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది చనిపోతున్న సంగతి తెలిసిందే. బ్యాక్టీరియా కంటే క్లిష్టతర నిర్మాణం కలిగి ఉండే ఏకకణ జీవులైన ‘ప్లాస్మోడియం (Plasmodium)' అనే ప్రొటోజోవా పరాన్నజీవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వ్యవస్థలు దెబ్బతిని మలేరియాకు గురవుతాం. ఆ జీవుల్ని మోసుకొచ్చే ఆడ ఆనాఫిలిస్ దోమ కాటుకు గురైనప్పుడు మనకు మలేరియా సోకుతుంది. మనషుల్లో మలేరియాకు కారణమయ్యే ప్లాస్ల్మోడియంలలో ప్రధానంగా ఆరు రకాలున్నాయి. వాటిలో ఒకటే ‘ప్లాస్మోడియం ఒవేల్'. ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియై, ప్లాస్మోడియం సెమీఒవేల్, ప్లాస్మోడియం నోవెస్లి ఇతర రకాలు. వీటిలో ఫాల్సిఫారం మలేరియా అన్నింటికంటే ప్రాణాంతకమయినది. ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన ప్లాస్మోడియం ఒవేల్ జీవిని తొలిసారి ఇండియాలో గుర్తించారు. ఆ మధ్య న్యూగునియా, ఫిలిప్పీన్స్ లోనూ కేసులను గుర్తించారు.

ప్రాణాంతకం కాకున్నాజాగ్రత్తలు..
పరాన్నజీవి ప్లాస్మోడియం ఒవేల్ ద్వారా మలేరియా వ్యాధి సోకిన తొలి కేసును కేరళలో గుర్తించగా, అది అంతగా ప్రాణాంతకం కాదని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి శైలజ చెప్పారు. సకాలంలో చికిత్స చేయడంతోపాటు ముందస్తు నివారణ చర్యలు చేపడితే ప్లాస్మోడియం ఒవేల్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఈ రకం మలేరియా వల్ల ప్రాణహాని సంభవిస్తుందనే సమాచారం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications