అయోధ్య, భూమి: తెరపైకి కొత్త ప్రతిపాదన
లక్నో: అయోధ్యలో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ ప్రాంతంలో ఆలయం, మసీదు నిర్మించాలని కొత్తగా ఫైజాబాద్ డివిజనల్ కమిషనర్ ఎదుటకు ప్రతిపాదన వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పత్రంలో హిందు, ముస్లీం వర్గాలకు చెందిన 10వేల మంది సంతకాలు చేశారు.
మాజీ హైకోర్టు జడ్జి పలోక్ బసు నేతృత్వంలో ఈ సంతకాల సేకరణ జరిగింది. తద్వారా ఈ ప్రతిపాదన వచ్చింది. ఫైజాబాద్ డివిజనల్ కమిషనర్ సూర్యప్రకాశ్ మిశ్రాకు ఇందుకు సంబంధించిన విజ్ఞపాన చేశారు. వివాద స్థలానికి సంబంధించి కొన్ని ఫొటోలు, సంతకాలతోకూడిన వినతి పత్రం తనకు అందినట్లు కమిషనర్ సూర్యప్రకాశ్ మిశ్రా తెలిపారు.
దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మిశ్రా చెప్పారు. సమస్య పరిష్కారం కోసం స్థానికులు పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశముందని ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జస్టిస్ బసు అభిప్రాయపడ్డారు.
ఆరేళ్లుగా స్థానికులతో కలిసి సమస్య పరిష్కారం కోసం ఆయన ఉద్యమిస్తున్నారు. పోరాటం సాగిస్తున్నారు. తాజాగా, రామాలయం, మసీదు పక్క పక్కనే నిర్మించేలా ప్రతిపాదన చేశారు. ఆ స్థలంలో ఈ రెండు నిర్మించేందుకు తమకు అభ్యంతరం లేదని సంతకాలు చేశారు.